ప్రభుత్వానికి యాజమాన్యం లేఖ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఆసుపత్రుల్లోనూ తప్పనిసరి వైద్యులను నియమించాలని ఆ సంస్థ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో కోరింది. ఐదుగురు ఆర్థోపెడిక్ సర్జన్లను, ఏడుగురు జనరల్ ఫిజీషియన్లు, ముగ్గురు రేడియాలజిస్టులు, ఆరుగురు గైనకాలజిస్టులు, ఆరుగురు జనరల్ సర్జన్లు, నలుగురు కంటి వైద్య నిపుణులు, ఇద్దరు ఛాతీ వైద్య నిపుణులను... మొత్తం 33 మంది స్పెషలిస్టు డాక్టర్లను ఏడాదిపాటు తప్పనిసరి నిబంధన కింద నియమించాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా సుమారు 600 మంది పీజీ, 130 మంది పీజీ డిప్లొమా వైద్యులు తప్పనిసరి వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో తమ ఆసుపత్రులకూ అవకాశం కల్పించాలని కోరింది. సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు వైద్య సేవలు అందించడానికి అక్కడ ఏడు ప్రాంతీయ ఆసుపత్రులు, 24 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటిల్లో 200 మంది వైద్యులు పనిచేస్తున్నారు. సింగరేణి కోరిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది పీజీ తప్పనిసరి కౌన్సెలింగ్లో సింగరేణికి అవకాశం కల్పిస్తారు.