ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి

Published Sun, Aug 2 2015 8:21 AM

Lovers attempt suicide

గోదావరిఖని (కరీంనగర్) : కడ వరకూ ఒకరికి ఒకరు తోడుందామని ఊసుల బాసలు చెప్పుకున్న ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా, ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రహీం(28) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలానికి చెందిన అలేఖ్య(25)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి ప్రేమగా మారింది.

ఇద్దరు కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నా.. అప్పటికే రహీంకు పెళ్లి కావడంతో.. ఏం చేయాలో అర్ధంకాని ప్రేమ జంట శనివారం అర్ధరాత్రి వంతెనపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యాయత్నానికి ముందే తాము ఈ లోకాన్ని వీడి వెళ్లిపోతున్నామని రహీం తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో అతని స్నేహితులు సంఘటనా  స్థలానికి చేరుకొని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే రహీం మృతిచెందాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అలేఖ్యను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. రహీం భార్య నిండు గర్భవతి అని తెలిసింది.
 

Advertisement
Advertisement