'జయ మరణంపై విచారణకు మేం రెడీ' | Sakshi
Sakshi News home page

'జయ మరణంపై విచారణకు మేం రెడీ'

Published Tue, Jul 18 2017 8:28 PM

'జయ మరణంపై విచారణకు మేం రెడీ'

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్య చికిత్సలలో ఎలాంటి పొరబాటు లేదని, ఆమె మరణంపై విచారణకు సిద్ధమని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలితకు 2016 సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత ఏర్పడింది. దీంతో థౌజండ్‌లైట్స్‌ అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిన ఆమెకు 70 రోజులకు పైగా చికిత్సలందించారు. ఆరోగ్యం కోలుకుంటున్నట్లు తెలుస్తుండగానే గత(2016) డిసెంబర్‌ 5న హఠాత్తుగా జయలలిత మృతి చెందారు.

దీంతో ఆమె మృతిపై అనేక అనుమానాలున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మృతిలో అనుమానం ఉందని, దీని గురించి న్యాయవిచారణ జరపాలంటూ ఓ.పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. దీనిపై అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై ఎటువంటి విచారణ జరిపినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జయలలితకు అందచేసిన చికిత్సలలో ఎటువంటి పొరపాటు జరగలేదని ఆమె చికిత్సలలో ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. చెన్నైలో మంగళవారం అపోలో హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో అపోలో మెమొరి, హెడేక్, మైగ్రేన్‌ క్లినిక్స్‌ను డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి ప్రారంభించి పైవిధంగా స్పందించారు.

Advertisement
Advertisement