ఇండియా ఓడిందని.. సంతోషించాడు! | Sakshi
Sakshi News home page

ఇండియా ఓడిందని.. సంతోషించాడు!

Published Thu, Mar 26 2015 6:22 PM

ఇండియా ఓడిందని.. సంతోషించాడు!

టీమిండియా ఓడిపోయిందని అభిమానులంతా తీవ్ర నిరాశలో మునిగిపోతే.. ఒక్క భారతీయుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది కదూ.. ఇంకెవరో కాదు.. సదా వివాదాల్లో మునిగితేలే రాంగోపాల్ వర్మే!! భారత జట్టు ఓడినందుకు తానెంతో సంతోషంగా ఉన్నానని, క్రికెట్ కంటే కూడా తాను ఎక్కువగా ద్వేషించేది ఏమైనా ఉందంటే.. అది క్రికెట్ ప్రేమికులనేనని కూడా ఆయన ట్విట్టర్లో చెప్పారు. సెమీస్లో భారత జట్టు ఓడిన తర్వాతి నుంచి వరుసపెట్టి రాము ట్వీట్లు ఇస్తూనే ఉన్నారు. తాను తన దేశాన్ని ప్రేమిస్తాను కాబట్టే క్రికెట్ను ద్వేషిస్తానని, క్రికెట్ వల్ల దేశవాసులు నాన్ ప్రొడక్టివ్గా మారిపోతారని.. వాళ్లు పనిచేయడం మానేసి టీవీలు చూస్తూ కూర్చుంటారని అన్నారు.

'క్రికెటైటిస్' అనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి బారి నుంచి నా దేశాన్ని రక్షించాల్సిందిగా దేవుళ్లందరినీ ప్రార్థిస్తానని కూడా ఈ నాస్తికుడు ట్విట్టర్లో చెప్పారు. మిగిలిన జట్లన్నింటినీ తాను కోరేది ఒక్కటేనని, ఇండియా జట్టును పదేపదే ఓడిస్తూ.. భారతీయులు క్రికెట్ చూడటం మానేసి పనిచేసేలా చూడాలని అన్నారు. మద్యపానం, ధూమపానం వల్ల జరిగే నష్టం కొంత మాత్రమేనని, పైగా వాటివల్ల వ్యక్తిగతంగానే నష్టం జరుగుతుందని, అయితే క్రికెట్కు అడిక్ట్ కావడం అనేది జాతీయ వ్యాధి అయిపోయిందని రామూ అన్నారు.  తాను ద్వేషించేవాళ్లనే ఎక్కువగా ప్రేమిస్తానని, ఎందుకంటే ప్రేమ కంటే ద్వేషం ఎక్కువ స్పైసీగా ఉంటుందని చివర్లో ముక్తాయింపు ఇచ్చారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement