'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు' | Sakshi
Sakshi News home page

'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు'

Published Mon, Nov 30 2015 8:19 PM

'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు' - Sakshi

న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాకు సూచించింది. 'మీరు పెద్ద హీరో. పెద్ద హృదయాన్ని కూడా చాటండి' అని గోవిందాకు సలహా ఇచ్చింది. 2008లో తనను చెంపదెబ్బ కొట్టి.. బెదిరించాడని సంతోష్‌రాయ్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత ఉద్దేశంతోనే గోవిందా ఆయనను చెంపదెబ్బ కొట్టాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.

రాయ్‌ను గోవిందా చెంపదెబ్బ కొడుతున్న వీడియోను మొబైల్‌లో చూసిన ధర్మాసనం.. ఆయనకు గోవిందా క్షమాపణ చెప్పాలని సలహా ఇచ్చింది. సినీతారలు బహిరంగ ప్రదేశాల్లో కొట్లాటలకు దిగకూడదని సూచించింది. రీల్‌లైఫ్‌లో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు రియల్‌లైఫ్‌లో చేయడం సరికాదని హితవు పలికింది. 'మేం మీ సినిమాలను చూస్తాం. కానీ మీరు ఎవరినైనా నిజంగా చెంప ఛెళ్లుమనిపిస్తే సహించం' అని జస్టిస్ వీ గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
Advertisement