‘మా’ అధ్యక్ష పదవి బరిలో... | Sakshi
Sakshi News home page

‘మా’ అధ్యక్ష పదవి బరిలో...

Published Tue, Mar 3 2015 12:10 AM

‘మా’ అధ్యక్ష పదవి బరిలో... - Sakshi

 ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కొత్త బాధ్యతలు తలకెత్తుకోవడానికి ముందుకొచ్చారు. ఈ నెలాఖరులో జరగాల్సిన తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - ‘మా’) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన బరిలో దిగుతున్నారు. ఈ సంగతి ఆయన సోమవారం మధ్యాహ్నం మీడియా సాక్షిగా ప్రకటించారు. ‘‘గడచిన 37 ఏళ్ళుగా నా సినిమాలతో అందరినీ అలరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ వచ్చిన నేను ఇటీవల మా అబ్బాయి పెళ్ళి కూడా చేసేశాక, కొత్త బాధ్యతలు తీసుకోదలిచాను.
 
 ఒక పక్క నటుడిగా పాత్రలు పోషిస్తూనే, కొంత సమయాన్ని నా తోటి కళాకారుల సేవ కోసం వినియోగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ‘‘ఇవాళ కళాకారులకు ఆరోగ్యం అతి పెద్ద సమస్యగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా కళాకారులందరికీ ఒకేలా ఆరోగ్యపరమైన సదుపాయం కలిగేలా చూడాలనీ, అందరినీ కలుపుకొని ఒకే తాటి మీద వెళ్ళాలనీ భావిస్తున్నా’’ అని ఆయన వివరించారు. గతంలో చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసి, కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ నెల 29న జరిగే ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవికి అందరి సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని రాజేంద్రప్రసాద్ భావిస్తున్నారు. రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగువాళ్ళమే కాబట్టి, రెండు రాష్ట్రాల నటీనటులూ తనకు మద్దతుగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 త్వరలోనే వారసుడి తెరంగేట్రం: కాగా, తన సినీ వారసుడి తెరంగేట్రానికి పనులు చురుకుగా సాగుతున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కుమారుడు బాలాజీ త్వరలోనే ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించే చిత్రంతో హీరోగా ముందుకు రానున్నట్లు ఆయన చెప్పారు. ఆ సినిమాకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.
 

Advertisement
Advertisement