త్రిపురారం : హరిత తెలంగాణే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి మండల పరిధిలోని ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ పరిశోధన క్షేత్రం, కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అందుకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలన్నారు. ఇక నుంచి ప్రతి గ్రామాన్ని సందర్శించి నాటిన మొక్కలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మొక్కలు నాటి వాపస్పోయిన వానలు తిరిగిరావాలని, కరువును పారదోలాలన్నారు. అనంతరం వ్యవసాయ పరిశోధన క్షేత్రం, కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులతో కలిసి 9500 మొక్కలు నాటారు. గత ఏడాది ఉపాధి హామీ కింద వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో పెట్టిన ప్రతి మొక్క బతికేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఉపాధి హామీ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు మంత్రి హామీ
ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి వచ్చే సంవత్సరం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, డీఈఓ చంద్రమోహన్, ఆర్డీఓ కిషన్రావు, ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ ఆనంద్కుమార్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి, ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మిరామచంద్రయ్య, ఎంసీ కోటిరెడ్డి, ఇస్లావత్ రాంచందర్నాయక్, సర్పంచ్ అల్లంపల్లి రమణ, ఏపీఓ యాట వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్రెడ్డి, నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రవీంద్రనాయక్, భద్రు తదితరులు పాల్గొన్నారు.