పన్ను పీకేస్తారు | Sakshi
Sakshi News home page

పన్ను పీకేస్తారు

Published Fri, Oct 31 2014 10:50 AM

no Quality services in Dental department of Guntur government hospital

గుంటూరు మెడికల్ : దంత వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు ఎన్నో వస్తున్నా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆ ఛాయలే కనిపించడంలేదు. చికిత్స కోసం వస్తున్న రోగులకు కేవలం ప్రాథమిక వైద్యసేవలే అందుతున్నారుు. తగినంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ పళ్లు పీకటం మినహా మరే వైద్యసేవలనూ అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ దంత వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వీరికి తోడుగా ఇద్దరు డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. అరుునా రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. సాధారణంగా పన్ను నొప్పితో వచ్చేవారికి చాలా రకాలుగా వాటిని నయం చేసే విధానాలు వచ్చేశారుు. ముఖ్యంగా రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్, పళ్లమధ్య ఏర్పడిన ఖాళీలను సిమెంట్‌తో పూరించడం, ప్రమాదాల్లో విరిగిన పళ్లకు క్యాప్‌వేసి కవర్ చేయడం, కృత్రిమ పళ్లసెట్ అమర్చడం వంటివి చేయొచ్చు. ఆ తరహా చికిత్సలు ఇక్కడ మచ్చుకైనా కానరావు. ఎత్తు పళ్లు, వంకర పళ్లను సరిచేసేందుకు క్లిప్‌లు పెట్టడం వంటి విధానాలే లేవు.
 
 ఆరోగ్యశ్రీ నిధులు దండిగా ఉన్నా....
 
 ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జీజీహెచ్‌కు కోట్లాది రూపాయలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అధిక ఆదాయం సంపాదించే ఆస్పత్రుల్లో జీజీహెచ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటోంది. ఇంతటి ఆదాయం వస్తున్నప్పటికీ దంత వైద్యవిభాగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అధికారులకు లేకపోవటం విస్మయం కలిగిస్తోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆధునిక వైద్యసేవలను అందిస్తుండగా జీజీహెచ్‌లో మాత్రం నామమాత్ర సేవలు అందిస్తున్నారు.
 సిబ్బంది, సౌకర్యాలు చాలటం లేదు: దంతవైద్యవిభాగంలో అరకొర వైద్యసేవలపై విభాగాధిపతి డాక్టర్ పార్వతి వద్ద ప్రస్తావించగా వైద్య సిబ్బంది సరిపోవటం లేదని చెప్పారు. దంతాల చికిత్సకు అవసరమైన మెటీరియల్ సకాలంలో పంపిణీ చేయటం లేదని తెలిపారు. వైద్యం చేసే సమయంలో సరిపడా నీటి సరఫరా జరగటం లేదని పేర్కొన్నారు. మెడికో లీగల్ కేసులకు ఆపరేషన్లు, పంటి నొప్పిని తగ్గించే చికిత్సలు చేస్తున్నామని వివరించారు.
 

Advertisement
Advertisement