టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం

Published Sun, Feb 19 2017 7:04 PM

టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం - Sakshi

ఆనంకు చేదు అనుభవం  
ఎమ్మెల్సీ సీటుపై దక్కని హామీ
మనస్తాపంతో అనుచరుల వద్ద ఆవేదన 

నెల్లూరు సిటీ: కాంగ్రెస్‌ పార్టీలో తాము చెప్పిందే వేదం..తాము చెప్పిన వారికే పదవులు అన్న విధంగా ఏలిన ఆనం కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆనం వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టీడీపీలో చేరామని అనచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.     

ఆనంపై బాబు ఆగ్రహం  
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ కోసం తనను కలిసిన ఆనం సోదరులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి  నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇచ్చేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఆనం సోదరులు టీడీపీలో చేరి చ క్రం తిప్పుదామని ముందుగానే వ్యూహరచన చేశారు. రామ నారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్‌ , వివేకా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయడు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. బాబు ఆగ్రహంతో ఆనం సోదరుల ముందస్తు వ్యూహాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.  

ఏమి ఇవ్వాలో నాకు తెలుసు  
ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం వివేకాందరెడ్డి స్వయంగా వెళ్లి సీఎంను కలిశారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా రెండు రోజులు విజయవాడలో బస చేసి చివరికి 2 నిమి షాలు మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జిగా అవకాశం కల్పించామని, ఇంకా ఏమి ఇవ్వాలో తెలుసునని, అడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. భంగపడ్డ ఆనం టీడీపీలో చేరి తప్పుచేశానని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆశలపై నీళ్లు
తనకు ఎమ్మెల్సీ స్థానం..తన కుమారుడికి నగర ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి ఆనం  టీడీపీలో చేరారు. తన అనుచరులకు రానున్న రోజుల్లో టీడీపీని మనమే లీడ్‌ చేస్తామని చెప్పారు. అమరావతి మూడ్రోజుల పర్యటనతో ఆనం అం చనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ని ఏ విధంగా లీడ్‌ చేశామో.. అలాగే టీడీపీని లీడ్‌ చేయవచ్చని  వివేకా అనుకున్నారు. అయితే  లోకేష్‌  మీ పని మీరు చూసుకోవాలని, మేయర్‌ జోలికి వెళ్లద్దని సూచించడం.. బాబు సైతం పార్టీలో విభేదాలకు కేంద్ర బిందువుగా మారవద్దని హెచ్చరించడంతో వివేకా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

ఆనం కంట కన్నీరు  
ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని విమర్శించడం..అవకాశం వచ్చినప్పుడల్లా తన శైలిలో ఎకసెక్కాలు ఆడడం మామూలే..అయితే విలేకరుల సమావేశంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు. తమ సొదరుల మధ్యన చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతూ కన్నీటి పర్వంతమయ్యారు. తాము చివరి వరకు రాజకీయాల్లోనే ఉంటామని తెలిపారు. సహనం కోల్పోయి..విలేకరులు అడిగిన ప్రశ్నకు సైతం సమాధానం ఇవ్వకుండా ఒంటి కాలిపై లేచారు.  తనను ఇంక ప్రశ్నించవద్దని, చాలు అని గట్టిగా ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పర్యటన అనంతరం ఆనంలో వచ్చిన మార్పు అటు టీడీపీ, ఇటు ఆనం వర్గంలో చర్చినీయాంశమైంది.   

Advertisement
Advertisement