జగన్‌ పాటకే భయపడ్డారు! | Hindupuram TDP Leaders Attack On YSRCP Leaders, Details Inside| Sakshi
Sakshi News home page

జగన్‌ పాటకే భయపడ్డారు!

Published Sat, May 4 2024 11:12 AM

Hindupuram TDP Leaders Attack on YSRCP Leaders

హిందూపురంలో   టీడీపీకి ఓటమి భయం 

వైఎస్‌ జగన్‌ పాటలు పెట్టారంటూ  పచ్చ నేతల గొడవ 

 వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి..   ముగ్గురికి గాయాలు 

హిందూపురం అర్బన్‌: ప్రజాభిమానం  మెండుగా ఉన్న వైఎస్‌ జగన్‌ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్‌ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే   ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్‌ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్‌ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. 

అందులో జగన్‌ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు  రెచ్చిపోయాయి. జగన్‌ పాటలు   ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు.  స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్‌సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. 

వైఎస్సార్‌ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్‌రెడ్డి,    నవీన్, బాబు, అసీఫ్‌లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్‌తో పాటు బాబు, నవీన్‌లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి  తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement