ఒంగోలు సెంట్రల్: భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా బీమా, గ్రామీణ తపాలా బీమా పాలసీలను సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం డివిజన్ తపాలా శాఖ సీనియర్ పర్యవేక్షకుడు ఎండీ జాఫర్ సాధిక్ తెలిపారు. ఒంగోలులోని భాగ్యనగర్ రెండో లైన్లో ఆంజనేయ కాంపెక్ల్లో ఉన్న ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరిండెంట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు నిండిన వారు అర్హులని స్పష్టం చేశారు. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేలను ఎన్ఎస్సీ, కేవీపీ ఎకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాడిట్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
రెజ్లింగ్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
కొనకనమిట్ల: చిత్తూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో మండలంలోని వెలుగొండలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఇట్లా శివయ్య, ఆర్.విష్ణువర్థన్, డి.మహంత్ అండర్–17 రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. బంగారు పతకం సాధించిన శివయ్య ఈ నెలాఖరున జార్ఖండ్లో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పీఈటీలు చంద్రశేఖర్, ఖాదర్ బాషాను, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
19న చేజర్ల తిరునాళ్లకు ఏర్పాట్లు
ఒంగోలు రూరల్: ఒంగోలు మండలంలోని చేజర్ల గ్రామంలో కొలువై ఉన్న చేజర్లమ్మ తల్లి తిరునాళ్లను ఈ నెల 19వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేజర్ల గ్రామంలో ఏటా నిర్వహించే ఈ తిరునాళ్లలో ఒంగోలుతోపాటు రూరల్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. చేజర్లమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి సీ్త్ర, పురుషులకు వేర్వేరు మార్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేస్తున్నామని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఏజెంట్ గుండెపోటుతో మృతి
మర్రిపూడి: వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని జువ్విగుంట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. జువ్విగుంట పోలింగ్ బూత్ 34లో జంగా వెంకటరామిరెడ్డి(37) వైఎస్సార్ సీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. చివరి 10 నిమిషాల సమయంలో తన ఓటు వినియోగించుకున్నారు. ఈవీఎంలను సీల్ చేసిన తర్వాత పోలింగ్ అధికారుల నుంచి ఫారం 17సీ తీసుకుని ఇంటికి వెళ్లారు. భోజనం చేసిన వెంటనే గుండె నొప్పితో కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఫోన్లో వెంకటరామిరెడ్డి కుటుబం సభ్యులను పరామర్శించారు. పలువురు పార్టీ నాయకులు మృతుడి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేసిన వెంకటరామిరెడ్డి లేని లోటు పార్టీకి తీర్చలేనిదని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, ఎంపీటీసీ కముజుల బ్రహ్మారెడ్డి, సర్పంచ్ రావులపల్లి సుమలత నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు మాకినేని సుధారాణి వెంకట్రావు పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బోద రమణారెడ్డి, ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, మాచేపల్లి నాగయ్య, బోగసముద్రం విజయభాస్కర్రెడ్డి, కదిరి భాస్కర్, మాచేపల్లి హనుమంతరావు ఉన్నారు.
ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ
ఒంగోలు టౌన్: ఒంగోలులోని భాగ్యనగర్లో గల రూడ్సెట్ సంస్థలో ఈనెల 22 నుంచి ఉచితంగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.ప్రతాప్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్, రేషన్ కార్డుతో సంప్రదించాలని, పేరు నమోదు కోసం 9492583484కు ఫోన్ చేయాలని సూచించారు.