సైకిలెక్కితే సైడ్‌ట్రాకే! | Sakshi
Sakshi News home page

సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!

Published Tue, Jan 23 2024 5:53 AM

TDP Ticket Controversy In Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీ­యాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్ర­బాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలప­డ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాము­ంచేశా­రని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజ­­కీయ నాయకులతోపాటు నంద్యాల వరద­రాజు­­లరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒక­ప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. 

చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్‌ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపో­వ­డం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయా­నికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్‌ ఇవ్వక­పోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు.



కోట్ల కోటకు బీటలు
కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా నాగి­రెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజ­కీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్య­మంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014­లో సూర్యప్రకాశ్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున కర్నూ­లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్ని­కల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపో­యారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్‌ ఆశించగా.. డోన్‌ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. 

భూమా కుటుంబం తంటాలు
వైఎస్సార్‌సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్‌కు టికెట్‌ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్‌ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే..

నమ్మితే నిండాముంచారు
శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలి­చిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీ­లో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్‌ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్ప­లేదు. ఇప్పుడు అసలు టికెట్‌ దక్కని పరిస్థితి నెల­కొ­ంది.

గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్‌ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్‌మోహన్‌­రెడ్డిని కాద­ని టీడీపీలో చేరితే 2019లో ఓడిపో­యారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మ­ల­మడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘో­రంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మె­ల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద­రాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడి­పో­యారు. 2019లో అతనికి టికెట్‌ కూడా ఇవ్వ­లే­దు.

అంతర్మథనంలో నేతలు
రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్‌­సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజ­కీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చా­రు. చంద్రబాబు మోసపూ­రిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీ­లో కొనసాగుతు­న్నామని, ఏ ఆప్షన్‌ ఉన్నా వెంటనే సైకిల్‌ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతు­న్నా­రు.

కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే..
2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీ­లో చేరిన వారిలో కర్నూలు, కోడు­మూరు, కదిరి, బద్వేల్‌ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, అత్తర్‌ చాంద్‌బాషా, జయ­రాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్ని­కల్లో చంద్రబాబు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో మోహన్‌­రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్‌­సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్‌బాషా, జయరాములు పూర్తిగా రాజ­కీయ భవిష్యత్‌ కోల్పోయారు.

కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్‌ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు.

Advertisement
Advertisement