దుబాయిలో విలాసాగర్‌వాసి మృతి | Sakshi
Sakshi News home page

దుబాయిలో విలాసాగర్‌వాసి మృతి

Published Thu, Apr 4 2024 10:23 AM

telangana person died in dubai - Sakshi

బోయినపల్లి(చొప్పదండి): బతుకుదెరువు కోసం పన్నెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు.. కూతుళ్ల పెళ్లికీ రాలేదు.. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలంలోని విలాసాగర్‌కు చెందిన చల్ల శ్రీనివాస్‌(58) గ్రామంలో హమాలీ పని చేసేవాడు.

 స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దుబాయి వెళ్లాడు. వెళ్లినప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. కోవిడ్, వీసా సమస్యల వల్ల తన ఇద్దరు కూతుళ్లు రవళి, రమ్య వివాహానికి సైతం రాలేకపోయాడు. మృతుడికి భార్య పద్మ ఉంది. ఆమె అప్పులు చేసి, కూతుళ్ల వివాహం జరిపించినట్లు గ్రా మస్తులు తెలిపారు. శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి చెందాడన్న విషయం దుబాయిలో ఉండే అతని బంధువు ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. 

విప్‌ను కలిసిన మృతుడి కుటుంబసభ్యులు
శ్రీనివాస్‌ మృతితో తాము దిక్కులేనివారమయ్యామని బాధిత కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. తమకు ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందించి, ఆదుకోవాలని బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి విన్నవించారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement