బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు.
రామేశ్వరం కేఫ్ వైట్ఫీల్డ్ అవుట్లెట్లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు.
తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది.
Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL
— Stranger (@amarDgreat) March 2, 2024
అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు.
నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు.