ఏకంగా మూడు పెళ్లిల్లు! చివ‌రికి అత్త‌మామ‌ల‌ను దారుణంగా.. | Sakshi
Sakshi News home page

ఏకంగా మూడు పెళ్లిల్లు! చివ‌రికి అత్త‌మామ‌ల‌ను దారుణంగా..

Published Sun, Dec 17 2023 10:16 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: యువతిని ప్రేమించి మూడో వివాహం చేసుకున్న వ్యక్తి తనకు కట్నం కావాలంటూ అత్తమామను ఇంటికి పిలిపించి కత్తితో పొడిచిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగంపేట్‌తండాకు చెందిన సభావత్‌ సాగర్‌ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో చేర్పించకపోవడంతో ఆమె మృతి చెందింది.

కొన్ని రోజుల తర్వాత ఖిల్లాఘణపూర్‌ పక్కనే ఉన్న మరో తండాకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈమె గర్భిణిగా ఉన్న సమయంలో గండేడ్‌ మండలం పంచలింగాల్‌తండాకు చెందిన మోహన్‌, మంగమ్మల కూతురు మాయను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ ఇంటికి రాకుండా బయటనే ఉన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు తండాకు రావాలని తెలపడంతో మాయ, సాగర్‌ శనివారం మంగంపేట్‌తండాకు వచ్చారు. తనకు రూ.2లక్షలు కావాలని ఇస్తే ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటానని తెలిపాడు.

ఈ విషయం మాట్లాడటానికి అత్తమామలను, రెండో భార్యను కూడా పిలిపించాడు. డబ్బులు ఇవ్వడానికి అత్తమామలు ఒప్పుకుని ఫోన్లో బంధువులతో ఈ విషయమై మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో కోపోద్రిక్తుడైన అల్లుడు సాగర్‌ అప్పటికే తెచ్చుకున్న కత్తులను తీసి అత్తమామలను పొడిచాడు. వారు అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని వారించారు. కత్తిపోట్లతో గాయాలపాలై ఉన్న వారిని వాహనంలో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడిని ఆయన తల్లి సహకరించడంతో అక్కిడి నుంచి పారిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు.
ఇవి చ‌ద‌వండి: తప్పిపోయి రెండేళ్లు దాటింది! ప్రస్తుతం..

Advertisement
Advertisement