తాడిపత్రిలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చినా ఇంకా పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. 24 గంటలూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ తనిఖీలు, గస్తీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పలు చోట్ల పికెటింగ్లు ఏర్పాటు చేశారు. సోమవారం డీఐజీ షిమోషి, ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో పట్టణ వీధుల్లో స్థానిక పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏపీఎస్పీ బలగాలు, ఏఆర్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ చేపట్టాయి. అశోక్ పిల్లర్ వద్ద ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ సమస్యాత్మక ప్రాంతాలైన బండామసీద్, చిన్న బజార్, కటికవీధి, సుంకులమ్మపాలెం, అంబేడ్కర్ సర్కిల్, గన్నెవారిపల్లి కాలనీ, యల్లనూరు రోడ్డు సర్కిల్, పుట్లూరు రోడ్డు సర్కిల్ మీదుగా అర్బన్ పోలీస్ స్టేషన్ వరకూ సాగింది. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ్బాస్కర్రెడ్డి,జి.రామకృష్ణ, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, శివభాస్కర్రెడ్డి, బీవీ శివారెడ్డి, యు.నరసింగప్ప, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి డీఎస్పీగా
జనార్దన నాయుడు అనంతపురం/తాడిపత్రి అర్బన్: తాడిపత్రి డీఎస్పీగా కే.జనార్దన నాయుడును నియమించారు. ఏలూరు సెబ్ డీఎస్పీగా ఉన్న ఆయన్ను ఇక్కడికి బదిలీ చేశారు. అలాగే, అనంతపురంలో వీఆర్లో ఉన్న పి. నాగేంద్ర ప్రసాద్ను తాడిపత్రి సీఐగా నియమించారు. ఆయనతో పాటు వీఆర్లో ఉన్న విశ్వనాథ చౌదరిని తిరుపతి జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్గా, శ్రీ సత్యసాయి జిల్లాలో వీఆర్లో ఉన్న ఎం. రామారావును తిరుపతి జిల్లా అలిపిరి పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో చోటు చేసుకున్న అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న కారణంతో గతంలో ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ గంగయ్య, అర్బన్ సీఐ మురళీ కృష్ణపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. 23న క్యాంపస్ డ్రైవ్ అనంతపురం ఎడ్యుకేషన్: హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 23న అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో క్యాంపస్ డ్రైవ్ చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి, ఐటీఐ మార్కుల మెమో, ఆధార్కార్డు, ఫొటోలు, పాన్కార్డ్, బ్యాంక్ పాస్బుక్, కులధ్రువీకరణ పత్రం రెండు సెట్లతో హాజరుకావాలని కోరారు. జీతం రూ. 14,074 నుంచి రూ.17,400 వరకు ఉంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్లో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 23న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ఐటీఐకు చేరుకోవాలని సూచించారు. 23న ఉద్యోగమేళా అనంతపురం: స్థానిక ఉప్పరపల్లి రోడ్డులో ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వై.వీ.మల్లారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రెండు సంవత్సరాల ఉచిత టెక్నికల్ శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. పదో తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ ఫెయిల్ (ఏ ట్రేడ్ అయినా) ఉద్యోగ మేళాకు అర్హులు. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువత పాల్గొనవచ్చు. శిక్షణ సమయంలో స్టైఫండ్ ఉంటుంది. మొదటి మూడు నెలలు రూ.7,500, తరువాత 9 నెలలు రూ.11,453, చివరి 12 నెలలు రూ.11,653 చెల్లిస్తారు. యువతీ,యువకులకు వేర్వేరు గా హాస్టల్ వసతి కల్పిస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందజేస్తారు. ఆసక్తి గల వారు తమ రెజ్యూమ్ లేదా బయోడేటాతో ఈ నెల 23న జాబ్మేళాకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : 90000 24919, 91004 77371, 77807 52418.