దేవరపల్లి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాదాపు మూడు నెలలుగా రేయింబవళ్లు వైఎస్సార్ సీపీ విజయానికి సైనికుల్లా పని చేసిన గోపాలపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లకు పార్టీ అభ్యర్థి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపులో కూడా ఏజెంట్లు ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని ఆమె కోరారు. నాలుగో తేదీన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈవీఎంలు
నన్నయలో భద్రం
రాజానగరం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూములకు సాయుధ బలగాల బందోబస్తు నడుమ తరలించారు. కొన్ని కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీంతో రాత్రంతా ఈవీఎంలను నన్నయ వర్సిటీకి తీసుకుని వస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము వరకూ వచ్చిన ఈవీఎంలను ఆయా రిసెప్షన్ కౌంటర్ల ద్వారా స్వీకరించారు. అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో వాటిని పరిశీలించి, నియోకవర్గాల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఆయా గదులకు సీల్ వేసి, కేంద్ర బలగల రక్షణ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎ.చైత్రవర్షిణి, రాజమండ్రి లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోలీసు యంత్రాంగానికి ఎస్పీ అభినందనలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేసిన కృషిని ఎస్పీ పి.జగదీష్ మంగళవారం ఒక ప్రకటనలో అభినందించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. పక్కా ప్రణాళికతో పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి, ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై కేసు
నిడదవోలు రూరల్: మండలంలోని రావిమెట్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేసిన ఘటనలో ఇద్దరి టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై రమేష్ మంగళవారం తెలిపారు. రావిమెట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ చిలుకూరి చిట్టిప్రసాద్కు, టీడీపీ కార్యకర్తలకు సోమవారం పోలింగ్ సమయంలో ఎన్నికల బూత్ వద్ద వివాదం తలెత్తింది. దీంతో చిట్టిప్రసాద్పై టీడీపీ కార్యకర్తలు కొట్టేందుకు వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన చిట్టిప్రసాద్ కుమారుడు భవానీ శివశంకరకుమార్పై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు భవానీ శివశంకర్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ కార్యకర్తలు రాంగోను శ్రీను, రాంగోను సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.