రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు | On Raksha Bandhan, Brother Sentenced To 20-Year Jail: Orissa HC - Sakshi
Sakshi News home page

రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు

Published Thu, Aug 31 2023 8:18 AM

On Raksha Bandhan Brother Sentenced To 20 Year Jail For This Reason - Sakshi

క్రైమ్‌: ‘‘ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌. ఒక సోదరుడు తన సోదరిని తన చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేసే పర్వదినం ఇది.  అలాంటి పండుగనాడు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం. కానీ, ఈ కేసులో నిందితుడు దుర్మార్గుడు.  అందుకే ఇలాంటి శిక్ష విధిస్తున్నా’’ అంటూ జస్టిస్‌ ఎస్‌ సాహూ వ్యాఖ్యలు చేశారు.

ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన కేసులో.. అంతే సంచలన తీర్పు వెల్లడించింది. తన చెల్లిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందేనని తెలిపింది. ట్రయల్‌ కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూనే.. మరో రెండేళ్ల పాటు శిక్షను పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి సాహూ.

మల్కన్‌గిరికి చెందిన నిందితుడు.. 2018-19 మధ్య తల్లిని చంపేస్తానని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. తల్లికి విషయం తెలిసి స్థానిక అధికారుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కొడుకుపైనే న్యాయపోరాటానికి దిగింది. స్థానిక నేతల అండతో కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు నిందితుడు. అయితే.. చివరకు న్యాయమే నెగ్గింది. 

ఈ కేసుకు సంబంధించి మల్కన్‌గిరి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లగా..  ఇలాంటి మృగానికి శిక్ష సరైందేనని జడ్జి చెబుతూ అదనంగా మరో రెండేళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు.

Advertisement
Advertisement