ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది.
2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి.
► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి.
► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి.
► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు.