మూలధన వ్యయంలో ఏపీ టాప్‌ | Sakshi
Sakshi News home page

మూలధన వ్యయంలో ఏపీ టాప్‌

Published Sun, Aug 27 2023 3:17 AM

AP tops in capital expenditure - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మూల ధన వ్యయంపై కాగ్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. బడ్జెట్‌లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే 47.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళం రాష్ట్రానికి చెందిన తొలి నాలుగు నెలల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్‌ పేర్కొంది

కేరళం బడ్జెట్‌లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 28.19 శాతమే వ్యయం చేసినట్లు కాగ్‌ తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఏపీ మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లు అని, ఇది బడ్జెట్‌లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో 47.79 శాతంగా ఉందని తెలిపింది. ఈ నాలుగు నెలల్లో కేరళం మూల ధన వ్యయం రూ.4,117.87 కోట్లు అని, ఇది బడ్జెట్‌ కేటాయింపుల్లో 28.19 శాతం అని వెల్లడించింది.

ఇతర రాష్ట్రాలకు చెందిన జూలై నెల మూల ధన వ్యయం గణాంకాలను కాగ్‌ ఇంకా విడుదల చేయలేదు. కాగా, ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ నుంచి మే వరకు) కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు బడ్జెట్‌లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర వ్యయం చేశాయనే వివరాలను ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. కేంద్రంతో పాటు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు చేయనంత మూల ధన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి త్రైమాసికంలోనే చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. 

తొలి త్రైమాసికంలో కేంద్రం కంటే ఎక్కువ వ్యయం 
కేంద్ర ప్రభుత్వం ఈ ఆ ర్థిక ఏడాది బడ్జెట్‌లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో 27.8 శాతం వ్యయం చేయగా, ఆంధ్రప్రదేశ్‌ 40.8 శాతం వ్యయం చేసినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో ఇంత పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం మూల ధన వ్యయం చేయడం స్వాగత సంకేతమని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. తొలి త్రైమాసికంలో మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ తరువాత తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల సరాసరి చూస్తే మూల ధన వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో 12.7 శాతంగా ఉంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు రంగాల్లో ఆస్తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులను చేపట్టిన విషయం తెలిసిందే.

ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మూలధన వ్యయంలో గత ప్రభుత్వం కన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా పట్టించుకోకుండా కేవలం అప్పులంటూ దు్రష్పచారం చేస్తుండటం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement