-
పుస్తెలతాడు కోసం దంపతుల హత్య
నిజామాబాద్: జల్సాలకు అలావాటు పడిన ఇద్దరు యువకులు పుస్తెల తాడు కోసం వృద్ధ దంపతులను హతమార్చారు. బీర్కూర్ మండలం రైతునగర్లో దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ డీఎస్పీ కా ర్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న రైతు నగర్లో కిరాణ షాపు నడు పుతూ జీవనం సాగిస్తున్న దారం నారాయణ (75), దారం సులోచన (70) దంపతులు హత్యకు గురయ్యారు. మృతుడి సోదరుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఎస్పీ తెలిపారు. శనివారం దామరంచ గ్రామానికి చెందిన బంగ్లా చింటూ అలియాస్ చరణ్, అతని తండ్రి బంగ్లా లక్ష్మణ్ బీర్కూర్లోని బంగారు దుకాణంలో పుస్తెల తాడును విక్రయించే ప్రయత్నం చేయగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా చింటూ తన స్నేహితుడైన ఎర్రోళ్ల నవీన్తో కలిసి నారాయణ, సులోచనలను హత్య చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ చెప్పారు. పేకాటతో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డా చింటూ, నవీన్ అప్పుడప్పుడు నారాయణ దుకాణానికి వెళ్లేవారని, సులోచన మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించాలని పథకం వేశారన్నారు. అందులో భాగంగా ఘటన జరిగిన రోజు నిందితులు నారాయణ ఇంటి వెనుకాల నుంచి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. ముందుగా సులోచనను హత్య చేశారని, అనంతరం ముందు గదిలో టీవీ చూస్తున్న నారాయణ వద్దకు వెళ్లి ఆయనను కూడా చంపేశారన్నారు. సులోచన మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తెల తాడును ఎత్తుకెళ్లారని చెప్పారు. పుస్తెల తాడును మూడు ముక్కలు చేసి చింటూ, లక్ష్మణ్, నవీన్ పంచుకున్నారన్నారు. పుస్తెల తాడును స్వాధీనం చేసుకొని చింటూ, నవీన్తో పాటు లక్ష్మణ్ను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. నవీన్, లక్ష్మణ్పై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ జగన్నాథ్రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ మురళి, పిట్లం, నస్రూల్లాబాద్ ఎస్సైలు విజయ్, రంజీత్రెడ్డి, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, ఏఎస్సై రాములు, సీసీఎస్ ఏఎస్సై రాజేశ్వర్, హెచ్సీ సురేందర్, కానిస్టేబుళ్లు, సుభాష్, వస్సీ, సంగమేశ్వర్ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సులోచన లట్కర్ మృతి చెందారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో ముంబయి దాదర్లోని సుశ్రుసా ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం సాయంత్ర తుదిశ్వాస విడిచారు. 1928 జూలై 30న కర్ణాటకలోని ఖడక్లాత్లో జన్మించిన సులోచన లట్కర్ 1946లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. (ఇది చదవండి: నా అవార్డులను వాష్రూమ్ డోర్ హ్యాండిల్స్గా పెట్టా: నటుడు) సులోచన లట్కర్ 1959లో 'దిల్ దేకే దేఖో' చిత్రం ద్వారా బాలీవుడ్లో కూడా అరంగేట్రం చేశారు. 1995 వరకు అనేక సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 'గోరా ఔర్ కాలా', 'సంపూర్ణ రామాయణం' 'జీవచా శాఖ' వంటి చిత్రాల్లో నటనకు పేరు సంపాదించారు. ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. దాదాపు 250కి పైగా మరాఠీ చిత్రాల్లో కనిపించారు. సినీ పరిశ్రమలో ఆమె చేసిన సేవలకుగానూ పలు అవార్డులు అందుకున్నారు. (ఇది చదవండి: ఇలా అవుతానని కలలో కూడా ఊహించలేదు: హీరోయిన్) సినీ ప్రపంచానికి లట్కర్ చేసిన సేవలకు గానూ 1999లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆ తర్వాత 2004లో ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఇది చలనచిత్ర రంగంలో ఆమె స్థాయిని మరింత పెంచింది. -
ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జ్యుడీషియల్ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరింది. జిల్లా జడ్జిల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. న్యాయవాదుల నుంచి కూడా న్యాయమూర్తులుగా ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల విచారణ వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. పి.శ్రీసుధ: 1967, జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. డాక్టర్ జి.రాధారాణి: 1963, జూన్ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఎన్.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. ఎ.వెంకటేశ్వర్రెడ్డి: 1961, ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ ఆవరణలోని స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
కాంగ్రెస్కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్ను ప్రకటించనుంది. అయితే, జోబాట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
అచ్చుకాని బహుమతి కథ
వచ్చిన కథలన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నాడు ప్రిన్సిపాలు పాండురంగారావు. అతని చేయి వణుకుతోంది, అంతరాత్మ నువ్వు చేస్తున్న పని మంచిది కాదని హెచ్చరించబోయింది. విసుగ్గా అంతరాత్మను జోకొట్టాడు. మంచికి నిర్వచనము ఏమిట? తను చేస్తున్న చెడు బయటికి యెలా వెడుతుంది? ‘‘నాన్నారూ!’’ త్రివేణి వచ్చింది, హడావుడిగా. ‘‘మరేమో, మా స్నేహితురాళ్లు ఏమంటున్నారంటే...’’ ‘‘చెప్పమ్మా ఏమన్నారు?’’ ‘‘చిన్న కథల పోటీకి మీరు న్యాయ నిర్ణేతలు కదా! నేను వ్రాసిన కథ పోటీకి అంగీకరించరట కదా!’’ ‘‘వాళ్లకేం తెలియదు, ఆ పత్రిక తెచ్చి నిబంధనలు చదువు’’ అన్నాడు. అతని గొంతు నీరసంగా ఉంది. నిబంధనలు చదివింది. న్యాయనిర్ణేతల పిల్లలు పాల్గొనరాదని యెక్కడా లేదు. ‘‘నాన్నారూ! నాకు ఫస్ట్ ప్రైజు ఇస్తారు కదండీ.’’ ‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు కూతురి వీపు నిమురుతూ. వెయ్యి రూపాయలు పోగొట్టుకోవడం తనకు మాత్రం ఇష్టమా? ‘‘మీ నాన్నగా రొక్కరిస్తే చాలా? మరో న్యాయ నిర్ణేత కూడా ఉన్నారుగా’’ అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ అన్నది. ‘‘అవునా నాన్నారూ?’’ ‘‘మీ అమ్మకేం తెలియదు. ఫస్టు ప్రైజు నీది’’ మళ్లీ మళ్లీ అన్నాడు. త్రివేణి ఉత్సాహంగా వెళ్లిపోయింది. ‘‘పసిదానికి ఆశ పెట్టడం దేనికి? మీరు ఇచ్చినా మరో న్యాయ నిర్ణేత ఇవ్వవద్దూ?’’ ‘‘ఇవ్వరని నీకు కలగాని వచ్చిందా? పత్రికలవారు నా స్నేహితులు. ఇక మరో న్యాయ నిర్ణేత రచయిత్రి. ఆమెకు నన్ను ఎదిరించే దమ్ములు లేవు. నువ్వూరుకుందూ!’’ అన్నాడు. ఉత్సాహవంతులయిన విద్యార్థులలోని రచనా పిపాసను బయటికి లాగాలని, ఓ ప్రముఖ పత్రిక – కాలేజీలో, హైస్కూల్లో చదివే విద్యార్థుల కోసం చిన్న కథల పోటీ పెట్టారు. మొదటి బహుమతి వెయ్యి రూపాయలు, రెండవ బహుమతి ఐదు వందలు, అని అనౌన్స్ చేసి, యెడిటర్స్ కాక, ప్రిన్సిపాల్ పాండురంగారావును, మరో రచయిత్రి నైనాదేవిని న్యాయ నిర్ణేతలుగా వేశారు. పాండురంగారావు కూతురు త్రివేణి కూడా ఓ కథ వ్రాసి, తను విద్యార్థిని అని కాలేజీ నుండి సర్టిఫై చేయించుకు వచ్చి, పోటీలో పాల్గొన్నది. పాండురంగారావు కూతురు కథ చదివి కాస్త మార్పులు, చేర్పులు చేయించి వ్రాద్దాం అనుకున్నాడు. కాని ఎడిటర్స్ మొదట చదివి వుంటే బాగోదని ఏమయితే అది అయిందని కూతురికే మొదటి బహుమతి ఇచ్చేశాడు. ప్రథమ బహుమతికి అర్హమైన కథను అన్నిటి క్రింద పెట్టాడు. ఆ రాత్రి కమలమ్మ కొన్ని చదివింది. కూతురిది అసలు చదవలేనంత అస్తవ్యస్తంగా ఉంది. ఆమెకు బాధ కల్గింది. ఆమె తండ్రి టీచరుగానే చేశాడు. వక్తృత్వం పోటీలు జరిగితే కమలమ్మ పాల్గొంటే అతను తప్పుకునేవాడు. ‘‘పంతులుగారూ! మీరు అన్యాయం చేయరని తెలుసు. తప్పుకోవటం యెందుకు?’’ ప్రధానోపాధ్యాయుడు అనేవాడు. ‘‘యెందుకండీ, ఒకవేళ మా అమ్మాయే బాగా మాట్లాడినా అందరు ఏమనుకుంటారోనని మొహమాటంతో ఇవ్వకపోవచ్చు’’ అంత నీతి నియమాలుండేవి. ప్రతిచోట అవినీతి అరాచకం ప్రాకిపోయింది. దాన్ని కూకటి వేళ్లతో కదిలించేవాడు యెప్పుడొస్తాడో! వారం రోజులకు పత్రికాధిపతి కౌండిన్య రెండవ జడ్జీ అయిన నైనాదేవి దగ్గరకు ఫైలు తీసుకువెళ్లి, ఆవిడ చేత కూడా చూపించుకుని, ఆవిడ వ్రాసిన రిమార్క్ తీసుకుని వచ్చాడు. ‘‘ఏమిటి? ఆవిడ వాటిని చదువబోయిందా? నేను వ్రాసినవే టిక్ కొట్టి ఉంటుంది కదూ?’’ సగర్వంగా అడిగాడు పాండురంగారావు. ‘‘అక్కడే మనము పొరపడ్డామండోయ్. తాను చదవటమే కాక అక్కడే ఉంటున్న ఇద్దరు ఎమ్.లిట్లతో కూడా చదివించింది. మీరు లాస్టున పెట్టిన అమ్మాయి కథకు మొదటి బహుమతి రావాలని సూచన చేస్తూ, యెందుకు రావాలో నోట్ పుటప్ చేశారు.’’ ‘‘మీరేం నిర్ణయించారు?’’ ‘‘మీరు యెలా అంటే అలా.’’ ‘‘బోడిది అక్షర జ్ఞానము లేనివారంతా రచయిత్రులే. ఓ కుటీర పరిశ్రమ అనుకుని రచనలు చేస్తూ ఇలాంటి వాటిల్లో తల దూరుస్తారా?’’ పాండురంగారావు కళ్లు ఎర్ర చేశాడు. ‘‘అబ్బే, ఆవిడ అభిప్రాయము ఆవిడ వ్రాశారు. మనం మనమే, ఆవిడనో న్యాయనిర్ణేతగా నిర్ణయించుకున్నాము. మాటలు అనటం భావ్యం కాదేమో.’’ ‘‘ఊ! త్రివేణి మా అమ్మాయి అని గుర్తించిందా?’’ ‘‘గుర్తించే ఉంటుంది...’’ నసిగాడు కౌండిన్య, ఆమె మెత్తగా వేసిన చీవాట్లు గుర్తుకు తెచ్చుకుంటూ. ‘‘వెయ్యి రూపాయల దగ్గర ఈ కక్కుర్తి ఏమిటండీ? తను న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు కూతురు పాల్గొనడం ఏం బావుంటుంది?’’ పాండురంగారావుకు ఎలా చెబుతాడు? ఇద్దరూ చిరకాల మిత్రులు. ఒకరి బలహీనతలు ఒకరికి తెలుసు. ‘‘ఆమె చెప్పినట్టే బహుమతి ఇస్తే రేపు మన తలకు ఆముదము రుద్దుతారు, అసలే సూద్రపు పీనుగులు.’’ ‘‘పోనీ ఒక పని చేస్తే? మొదటి, రెండవ బహుమతి కాక, ఆవిడ మొదటి బహుమతి ఇచ్చిన అమ్మాయికీ ప్రత్యేకమయిన బహుమతి ఇస్తే...’’ ‘‘ఆ... యెందుకు లెండి.’’ ‘‘రేపు మన మీద పడి యేడ్వకుండాను.’’ ఆ పై వారము ఫలితాలు పత్రికలో ప్రకటించారు. అది చూచి పాండురంగారావు గర్వంగాను, నైనాదేవి బాధగానూ నవ్వుకున్నారు. ప్రముఖుల సమక్షంలో బహుమతి ప్రదానము జరుగుతుందని ప్రకటించారు. ఆహ్వానాన్ని చూచుకొని పాండురంగారావు ఆలోచనలో పడ్డాడు. ఆ సభకు ఆకతాయి వెధవలు వచ్చి, త్రివేణి తన కూతురని గుర్తిస్తే? అవాకులూ చవాకులూ వాగితే? అర్జంటుగా తలనొప్పి తెచ్చుకుని మంచ మెక్కేశాడు. ‘‘నాన్నారూ! ఈరోజు నా కథకు బహుమతి ఇస్తారు. మీరు రండి’’ అని మారాం మొదలు పెట్టింది త్రివేణి. ‘‘నాకు ఆరోగ్యం బాగా లేదమ్మా’’ అన్నాడు. మూతి ముడుచుకు కూర్చుంది త్రివేణి. ‘‘మా తల్లివి కదూ! వెళ్లి బహుమతి తీసుకుని అందరు మాట్లాడింది జాగ్రత్తగా విను. ముఖ్యంగా ఆ నైనాదేవి ఏమంటుందో విను’’ అన్నాడు అనునయిస్తూ. నిరాశగా వెళ్లిపోయింది. విసుగ్గా సిగరెట్టు వెలిగించుకున్నాడు. రాత్రి యెనిమిది గంటల వరకు అసహనంగా గడిపాడు. ప్రదానోత్సవం ఇంతసేపా? ఆ నైనాదేవి పేలుతూ ఓ రెండు గంటలు ఉపన్యాసం యిచ్చి ఉంటుంది! ‘‘నాన్నారూ! ఇదిగోనండీ చెక్కు సర్టిఫికెట్టు’’ లేడిపిల్లలా దూకుతూ వచ్చింది త్రివేణి. వెనకాల కమలమ్మ వచ్చింది. ‘‘ఇంతాలస్యం అయిందేం, సభ ఆలస్యంగా ప్రారంభం అయిందా?’’ ‘‘లేదండీ, వచ్చేటప్పుడు బస్సులు దొరకలేదు. సభ అరగంటలో ముగిసింది. ఇద్దరు న్యాయనిర్ణేతలు రాలేదు కదా.’’ ‘‘ఏమిటీ? నైనాదేవి రాలేదా? యెందుకు?’’ ‘‘ఏమో కౌండిన్యగారే పోటీ వుద్దేశం చెప్పారు. ఆ తరువాత మంత్రిగారు నాలుగు మాటలు చెప్పి బహుమతులిచ్చారు, అరగంటలో అయిపోయింది.’’ ‘‘అమ్మయ్య’’ అనుకుని గుండెల మీద చేయి వేసుకున్నాడు. అంతవరకు ఏవేవో ఊహిస్తున్న అతని మనసు కుదుటపడింది. ఆ విషయము పాతబడిపోయింది. అనుకున్న ప్రకారము పోటీలో నెగ్గిన కథలు పత్రికలో ప్రచురించలేదు. అనివార్య కారణాల వలన కథలు ప్రచురించలేదని ప్రకటించారు. అది చూచి త్రివేణి నిరుత్సాహ పడింది. విషయం తండ్రితో చెప్పింది. సాయంత్రము కాలేజీ నుండి వస్తుండగా కౌండిన్య దగ్గరికి వెళ్లాడు. ఆమాట, ఈమాట చెప్పాడు. ‘‘మొన్న సభకు నైనాదేవి రాలేదట.’’ ‘‘మీరు రాలేదు కదా! అందరూ ఏమనుకుంటారోనని ఆమెకు ఫోను చేశాము. ‘వచ్చి అక్కడ నేను ఆత్మను చంపుకుని అబద్ధాలు మాటలాడలేను. నిజం మాటలాడి మీ అందరితో నిష్టూరము కొని తెచ్చుకోలేను’ అన్నది.’’ ‘‘బోడి! ఏడ్వలేకపోయింది’’ ‘‘కథలు ప్రచురించినా, పాఠకులతో గోల లెండి’’ కౌండిన్య మాట మార్చాడు. ‘‘త్రివేణి కథ ఇలా యివ్వండి. దిద్ది పట్టుకొస్తాను’’ అన్నాడు. కౌండిన్య ఆశ్చర్యంగా చూశాడు. బాహ్యంగా తమ తప్పులు కప్పి పుచ్చుకున్నా అంతరాత్మ యెలా అంగీకరిస్తుంది? ‘‘ఇక ఇప్పుడా తతంగం అంతా యెందుకు లెండి? మన చుట్టూ వున్నవారు వేయి కళ్లతో కనిపెట్టి చూస్తారు’’ అన్నాడు. పాండురంగారావు ఇంటికి వచ్చాడు. త్రివేణి ఆశగా ఎదురు వచ్చింది. ‘‘ఏం నాన్నారూ? నా కథ అచ్చు అవుతుందా?’’ ‘‘నోరుమూసుకో, రాసింది యింతోటి మహాకథ’’ విసుగ్గా చూచాడు. - మాదిరెడ్డి సులోచన
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement