-
వనం చేరిన సమ్మక్క..
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను శనివారం సాయంత్రం వడ్డెలు (గిరిజన పూజారులు) ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు. ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వాన జల్లులు కురవడం గమనార్హం. చివరిరోజు కార్యక్రమం ఇలా.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి ఏడున్నర వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటికి తీసుకెళ్లి రాత్రి 7.27 గంటల సమయంలో చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సంప్రదాయం ప్రకారం.. సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారెలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు పోటీపడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కన్నెపల్లికి సారలమ్మ.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర వడ్డెలు సారలమ్మ గద్దె వద్ద గిరిజన సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాక సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మొంటె (వెదురుబుట్ట)ను తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకడానికి ప్రయత్నించారు. మరోవైపు గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరిరోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు.. గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసిందని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రకటించారు. ప్రస్తుత మేడారం జాతరకు మొత్తంగా 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని.. వారు ఇక్కడికి చేరుకునేందుకు లక్షన్నర వాహనాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. బుధవారం తిరుగువారం పండుగ.. సమ్మక్క–సారలమ్మలకు ఈనెల 28న పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన తర్వాత ఇలా తిరుగువారం పండుగ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని.. జాతరకు వచ్చిన భక్తులు చల్లంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని పూజారులు తెలిపారు. తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం మేడారం గ్రామస్తులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను అలికి శుద్ధి చేస్తారు. సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పూజారులు జాతర సమయంలో తమకు ఇళ్లకు ఆహా్వనించిన బంధువులకు కొత్త వస్త్రాలు పెట్టి సాగనంపుతారు. మేడారం మహాజాతర తిరిగి 2026 మాఘమాసంలో జరగనుంది. గద్దెను వీడి వనప్రవేశం చేసినదిలా.. 5.10 గంటలకు గోవిందరాజులు 5.30 గంటలకు పగిడిద్దరాజు 7.27 గంటలకు సమ్మక్క వనప్రవేశం 7.40 గంటలకు సారలమ్మ వనప్రవేశం ఆనవాయితీ ప్రకారం తొలుతగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను గద్దెల మీది నుంచి సాగనంపుతారు. వారు వెళ్లగానే సమ్మక్క వన ప్రవేశ కార్యక్రమం ఉంటుంది. చివరిగా సారలమ్మను తీసుకెళతారు. -
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
బావ కోసం దళంలో చేరి...
సాక్షి, హైదరాబాద్/గంగారం: మన్యంలో పుట్టిన ప్రేమకథ.. దండకారణ్యంలో సమాప్తమైంది. కష్టాలు, కన్నీళ్లు, తూటాలు, చట్టాలు, అనారోగ్యం, బంధాలు, బంధువులు ఏవీ వారిని ఆపలేకపోయాయి. చనిపోతావని బంధువులు బెదిరించినా.. ఆమె లెక్కచేయలేదు. బంధాలను తెంచుకుంది. అడవిలో ఉన్న బావను వెతుక్కుంటూ వెళ్లింది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసింది. చివరికి అతనితోపాటే కరోనా వైరస్కు బలైపోయింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్–జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించాడు. 24న సమ్మక్క కూడా వైరస్తో పోరాడుతూ చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బావ వెంటే బతుకు అంటూ... వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ– సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు ‘సాక్షి’కి చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది. 2012లో తిరిగి అడవిలోకి.. సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు. -
సమ్మక్క బ్యారేజీ సిద్ధమవుతోంది!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నది జలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లోనే గోదావరి నీటిని నిలిపేలా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ పనుల పూర్తిపై మార్గదర్శనం చేస్తున్నారు. గేట్లు అమర్చే ప్రక్రియ ఆరంభం.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంగనర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించారు. అయితే కంతనపల్లితో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో ఇప్పటికే రూ.1,100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 58 గేట్ల తయారీ పూర్తయింది. ఆదివారం నుంచి వాటిని అమర్చే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తవ్వగా, వాటి మధ్యలోంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. దీని ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వలను ఈ ఏడాది ఏప్రిల్లో ఖాళీ చేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ మరమ్మతులపై బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన తుపాకులగూడెం చేరుతుంది. మేడిగడ్డ నుంచి వచ్చే నీరంతా తుపాకులగూడెంలో నిల్వ ఉండేలా బ్యారేజీ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పూర్తి చేయాలని, ఈ లెవల్లో 2.90 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని సీఎం గతంలోనే సూచించగా, ఈ పనులను ఇటీవలే ముగించారు. వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర నీటిని 6.94 టీఎంసీల నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, ఆ పనులు వేగిరమయ్యాయి. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దీనికింద నిర్ణయించి 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. అయితే దేవాదులలోని మూడో దశ పనులు పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు నీరందించే అవకాశాలుండటంతో ఆ పనులను వేగిరం చేశారు. -
సమ్మక్క బ్యారేజీ.. సీఎం కేసీఆర్ నామకరణం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుధవారం రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా తీగలగట్టుపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే బస చేసి గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తా రు. తర్వాత లక్ష్మీ బ్యారేజీని సందర్శించి, అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తీగలగట్టుపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తారు. నీటి విడుదలపై సమీక్ష... సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఈఎన్సీలు మురళీధర్రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండేతో సమీక్ష నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుతోంది. బ్యారేజీలు నిండుకుండలా మారినయ్. రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసే దిశగా.. అటు నుంచి కాలువలకు మళ్లించేలా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి బ్యారేజీలో ప్రస్తుతం 16.12 టీఎంసీ నిల్వలకు గాను 14 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. దీంతో లక్ష్మి పంప్హౌజ్ పరిధిలో 11 పంప్లను రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరు రిజర్వాయర్ ద్వారా ఎల్ఎండీకి తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీలో ఉన్న నీటిని ఎల్లంపల్లికి తరలించడంపై కేసీఆర్ గురువారం నాటి పర్యటన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చే అవకాలున్నాయి. ఇదిలా ఉండగా, తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత శ్రీసమ్మక్క పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement