-
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
పక్కాగా ధరణి అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది. నిషేధిత భూములు పెద్ద సవాల్! కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు. రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి. కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్వేర్ను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు. గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధిత జాబితాలో పట్టా భూములు రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్ -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
రిజిస్ట్రేషన్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. ధరణిపై సమీక్షించినా... వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి పోర్టల్పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement