-
కథ: చూడలేని కళ్లు
సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే ‘గౌతమి’ ఎక్స్ప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆయాసపడుతూ హడావిడిగా మా‘బే’ లోపల కొచ్చింది. కూడా వచ్చిన సిబ్బంది బెర్త్ నెంబర్ల కేసి ఎగాదిగా చూసి ‘అమ్మ గారూ, మీ బెర్త్ యిదే’ అంటూ నా పై నున్న మిడిల్ బెర్త్ కేసి చూపించారు. సూట్ కేస్ లోయర్ బెర్త్ కింద సర్ది బ్రీఫ్కేస్ ఆవిడ చేతికందించి వెళ్లొస్తాం అమ్మగారూ, జాగ్రత్తండి’ అంటూ వినయంగా నమస్కరించి రైలు కదులుతుండగా బయటకు పరుగెత్తారు. ఖాళీగా ఉన్న నా యెదుటి సీట్లో కూర్చున్న ఆమె ముందుగా హేండ్ బ్యాగ్నూ, ఆ తరువాత బ్రీప్కేస్నూ తెరిచి దేని కోసమో వెతుకుతూ గాబరాపడ్డం నేను గమనించాను. ‘మేడమ్ మీరేమైనా మర్చిపోయారా?’ అంటూ మర్యాద కొద్దీ పలకరించాను. ‘ఫర్వాలేదు లెండి బయల్దేరే తొందరలో షుగర్ టాబ్లెట్స్ మర్చిపోయాను’ అందామె కంగారు నణుచుకొంటూ. ‘ఇవి చూడండి. మీకు పనికొస్తాయేమో’ అంటూ నా దగ్గరున్న స్ట్రిప్ తీసి యిచ్చాను. ‘థాంక్స్, రక్షించారు. నేను వాడుతున్న టాబ్లెట్స్ యివే’ అంటూ నేను ఫర్వాలేదు వుంచమంటున్నా వినకుండా ఒక్క టాబ్లెట్ మాత్రం తీసుకొని మిగిలినవి యిచ్చేశారు. ‘మీరెంతవరకు?’ మార్యదపూర్వకంగా అడిగారు. ‘రాజమండ్రిలో దిగి అమలాపురం వెళ్లాలి’ ‘అమలాపురమా? మీరు లెక్చర ర్ వనమాలి గారు కానీనా?’ ‘అవునండీ. మీకెలా తెలుసు?’ అన్నాను కించిత్ ఆశ్చర్యపడుతూ. ‘నమస్కారమండీ. మిమ్మల్నెక్కడో చూసినట్టుందని యిందాకటి నుంచీ అనుకుంటున్నాను. నేను ‘లు’ గారి మిసెస్.. గీతని’ నేను తుళ్లిపడ్డాను. అంతటి ఉన్నత స్థితిలో వున్నావిడ రైల్లో ప్రయాణించడం నమ్మశక్యం కాలేదు. ‘అలాగాండీ, మిమ్మల్నిలా కలవడం చాలా సంతోషం’ నా మాటలు పూర్తి కాకుండానే టికెట్స్ ‘చెక్’ చెయ్యడానికి టి.టి.ఇ. వచ్చాడు. ఆమె మొహమాటపడుతూ తను కూర్చున్న లోయర్ బెర్త్ ఖాళీయేనా అని అడిగింది. ‘సారీ, అది వరంగల్ కోటాది’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు. ‘నా లోయర్ బెర్త్ మీరు తీసుకోండి’ ‘థాంక్స్. మీ కిబ్బంది లేకపోతే అలాగే’ ‘అదేం లేదు. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మి’ ‘రక్షించారు. చూస్తున్నారుగా నాది స్థూలకాయం. అందుకని మీకు కొంచెం అసౌకర్యమయినా మీ ఆఫర్ని కాదనలేకపోతున్నాను’ ఆమె నిష్కాపట్యం, నిరాడంబరత నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమెతో మాట్లాడ్డానికి నేను సంశయిస్తున్నా ఆమె కలుపుగోలుగా నన్ను మాటల్లోకి దించింది. సహజంగా మా సంబాషణ ‘లు’ గారి చుట్టూనే నడిచింది. ‘లు’ గార్కి నా పట్ల ఉండే అభిమానం గురించి చెపుతూ మధ్యలో చిట్టిబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల చిట్టిబాబు తరచుగా వాళ్లింటికి వస్తున్నాడనీ, కులం ముడితో ‘లు’ గారి దగ్గర చనువు పెంచుకున్నాడనీ చెపుతూ నేను అదిరిపడే ఓ ప్రశ్న వేసింది. ‘ఈ మధ్య మీరూ చిట్టిబాబు ఏమైనా గొడవ పడ్డారా?’అని! ‘అలాంటిదేమీ లేదే. చిట్టిబాబు నాకంత సన్నిహితుడు కూడా కాదు. అసలు మీకా అనుమానమెందు కొచ్చింది?’ అన్నాను విస్తుపోతూ. నిజానికి ఆమె ప్రశ్న నేను తికమకపడుతున్న ఓ ‘పజిల్ని’ కదిపింది. ‘అవునా? మరి మీకంత క్లోజ్ కానప్పుడు ‘లు’ గారి దగ్గర తరచుగా మీ గురించి యెందుకు మాట్లాడుతుంటాడు?’అందామె ఆసక్తిగా. ‘ఈ విషయం కూడా నాకు తెలియదు. మీరు చెపుతుంటే మొదటిసారి వింటున్నాను..’ ఆమె చెప్పిన సమాచారం నాకు ఆందోళనను కలిగించిన మాట నిజం. నేను ‘లు’ మధ్యలో చిట్టిబాబు – మాదొక కాకతాళీయమైన సమీకరణం. దానికింత పొడిగింపు.. నా జ్ఞాపకాలు చిట్టిబాబు పరిచయాన్ని తవ్వడం ప్రారంభించాయి... ∙∙ రెండు మూడేళ్ల క్రితం వరకు నాకు చిట్టిబాబు యెవరో తెలియదు. అతను నాకు మార్నింగ్ వాక్లో తారసపడిన వ్యక్తుల్లో ఒకడు. జ్యూయలరీ షాపు యజమానిగా తనంత తాను పరిచయం చేసుకొన్నాడు. ఆ తర్వాత రోడ్ మీద కలిసినప్పుడల్లా పత్రికల్లో వచ్చిన నా రచనల గురించో నా వార్తల గురించో చెప్పి నన్ను అతిశయోక్తులతో మెచ్చుకొనేవాడు. అలాంటి స్వల్ప పరిచయంతో ఓ రోజు పొద్దుటే నన్ను వెదుక్కొంటూ వచ్చి మా యింటి తలుపు తట్టాడు. మడత నలగని తెల్లని బట్టలు, వాటికి మాచ్ అయ్యే తెల్లటి చెప్పులూ, మెడలో నులకతాడు లాంటి బంగారు గొలుసు, చేతి వేళ్ల నిండా వుంగరాలు... రోడ్ మీద చూసినప్పటి కంటే భిన్నమైన ‘గెటప్’లో వున్న ఆ మనిషిని వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా మొహమాటపడుతూ లోపలకు పిల్చి కూర్చోమన్నాను. ‘లు’ గారు మీ ఇంటి కొచ్చినట్లు నిన్నటి పేపర్లలో ఫొటోలతో సహా వేశారు. తమరు చూశారా?’ అంటూ ఓ పేపర్ కటింగ్ నా కందించాడు చిట్టిబాబు. అప్పటికి గుర్తుపట్టాను – అతనెవరో!. వనమాలి యింట ‘డి.వి.లు’,‘హల్ చల్’ అంటూ జిల్లా ఎడిషన్లో వచ్చిన ఆ వార్త నేను చూసిందే! ‘డి.వి.లు’ పత్రికల్లో తరుచుగా పేరు కనిపించే ‘సెలబ్రిటీ’. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘కైట్స్’ చైర్మన్. ఆయనను ఇటీవలే ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది కూడా. మొన్న కోనసీమలోని దేవాలయాల్ని దర్శించుకొని వెళ్తూ వెళ్తూ చెప్పాపెట్టకుండా మా యింటి కొచ్చారు. ఆయన వెంటబడిన పత్రికా విలేకరులు దానికి ప్రాముఖ్యమిచ్చి ఆర్భాటంగా రాశారు. ఆ న్యూస్ చూసి అయిదారుగురు పరిచయస్థులు తమ సంబంధీకులకు ‘కైట్స్’లో వుద్యోగాలిప్పించమని నన్ను సతాయించారు. డబ్బు ఆశ కూడా చూపించారు. ‘లు’ గారు మా యింటికి రావడం కాకతాళీయం తప్ప ఆయన దగ్గర నాకంత పలుకుబడి లేదని చెప్పి తప్పించుకొనే సరికి నా తలప్రాణం తోక కొచ్చింది. మా యింటికెప్పుడూ రాని చిట్టిబాబు కూడా అలాంటి బాపతేనని అనుమానించి అతను అడక్కుండానే పని చెప్పే సరికి సిగ్గుపడ్డం నావంతయింది. మా వూళ్లో భారీ స్థాయిలో చిట్టిబాబు ప్రారంభిస్తున్న మెగా జ్యూయలరీ షాపును ఓపెన్ చేయ్యడానికి ‘లు’ గార్ని ఒప్పించమని అతని కోరికట! అతని కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా యిలాంటి ప్రారంభోత్సవాలకు సినీ రాజకీయ రంగాలకు చెందిన గ్లామరున్న వాళ్లను పిలుస్తుంటారు. అలాంటిది యెంత కార్పొరేట్ దిగ్గజమైనా ‘డి.వి.లు’ను కోరుకోవడంలోని ఆంతర్యం నాకర్థం కాలేదు. పిల్చేవాడి మాటెలా వున్నా ‘లు’కి ఈ పని మీద వచ్చే కోరిక, తీరిక వుంటాయా? అదే మాట చిట్టిబాబుకు చెప్పాను. ‘క్షమించాలి గురువుగారూ. మీరాయనను వుద్యోగాలూ వుపకారాలు అడగడం లేదు. ఆయన రాక వల్ల మన ప్రాంతంలో మీ విలువ, నా విలువ పెరుగుతాయి. ఆయన పేరు మారు మోగిపోతుంది. దయచేసి మీరు కాదనకండి.’ చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న చిట్టిబాబును కాదనలేక, ఆ కాదనే మాటేదో ‘లు’ గారే అంటారని ఆయనకు ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు ఫోన్ చెయ్యగానే దొరికాడు. నే నన్నట్టుగానే తనలాంటి వాణ్ణి యెందుకు పిలుస్తున్నారంటూనే ముక్తాయింపుగా ‘మీ మాట కాదనలేకపోతున్నాను. ఆయనను రమ్మనండి చుద్దాం’ అని చిన్న ఆశను కల్పించాడు. అది కంటితుడుపు అని నేననుకున్నా చిట్టిబాబు మాత్రం గంపెడాశతో సంబరపడిపోతూ నాకు మళ్లీ థాంక్స్ చెప్పి హైదరరాబాద్ వెళ్లాడు. వారం తిరక్కుండా ‘లు’ గారు ప్రారంభోత్సవానికి అంగీకరించారనే శుభవార్తతో పాటు ఓ పళ్లబుట్టను కూడా మా యింటికి మోసుకొచ్చాడు. ఫంక్షన్కి నాతో పాటు నా శ్రీమతి కూడా రావాలని యిద్దర్నీ ఆహ్వానించి, వస్తామని వాగ్దానం చేయించుకొని మరీ వెళ్లాడు... ‘ఇతనేదో అమాయకుడనుకున్నాం గాని కార్యసాధకుడే. కానీ వాలకం చూస్తే నమ్మదగిన మనిషిలా లేదు. ఎక్కడి మద్దెల అక్కడ వేసి పబ్బం గడుపుకొనే బాపతులా వున్నాడు. ఇలాంటి వాణ్ని ‘లు’ గారంతటి పెద్దాయన దగ్గరకు చేరనిస్తే రేపు మీకు ‘మేక’వుతాడేమో చూడండి’ అని హెచ్చరించింది చిట్టిబాబును అంచనా వేస్తూ నా శ్రీమతి. ‘నీ కన్నీ అనుమానాలే. అవసరం కొద్దీ చిట్టిబాబు మన దగ్గర కొచ్చాడు గాని ఆ తర్వాత అతనెవరో మన మెవరమో! ఇక ‘లు’ గారిది, నాది కృష్ణ కుచేలుర లాంటి అనుబంధం. ఆయనకు యెంత అభిమానం లేకపోతే మొన్న మనింటి కొచ్చాడు?’ ‘అవును– ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు కదా..మరి పేరు అలావుందే?’ ‘ఓహ్! అదా నీ సందేహం? అతనిదీ నాదీ ఒకే వూరని యిది వరకెప్పుడో చెప్పాను కదా. అతని అసలు పేరు వెంకటేశ్వర్లు. ఇంటి పేరు దున్నపోతు. కార్పొరేట్ రంగంలో తెలుగు తెలిసిన వాళ్లు హేళన చెయ్యకుండా, తెలుగు రానివాళ్లు తన పేరును ఖూనీ చెయ్యకుండా తన పేరును తెలివిగా ‘డి.వి.లు’గా మార్చుకొన్నాడు. ఈ రహస్యం ఆయన యెవరికీ చెప్పరు. ఎవరికో కాని తెలియదు. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో మా నాన్న గారి దగ్గర చదువుకొన్నాడట. పేద కుటుంబంలో పుట్టి యెన్నో కష్టాలనుభవించి పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికెదిగాడట. నువ్వు పొరపాటున కూడా ‘లు’ గారి వ్యక్తిగత విషయాల గురించి యెక్కడా నోరుజారకు సుమా..’ ‘నాకలాంటి సందర్భమే రాదు. సరేనా?’ అంటూ తను హామీ యిచ్చింది. మేమూహించిన దాని కంటే గొప్పగా చిట్టిబాబు ‘మెగా జ్యూయలరీ షోరూమ్’ ప్రారంభోత్సవం జరిగింది. ఊరంతా ప్లెక్స్లు ఏర్పాటు చేసి వూరేగింపుగా పూర్ణ కుంభ స్వాగతంతో ‘లు’ను షోరూమ్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆయన కూడా చాలా ఉల్లాసంగా కనిపించారు. రిబ్బన్ కత్తిరించిన తర్వాత ‘లు’ ప్రసంగిస్తూ మా మైత్రీబంధాన్ని ప్రస్తావించి అదే తననీ కార్యక్రమానికి రప్పించిందని చెప్పడంతో అభిమానుల చప్పట్లు మారు మ్రోగాయి. చిట్టిబాబు కృతజ్ఞతాపూర్వకంగా ‘లు’గారి నక్షత్రానికి అనువైన రాయితో చేయించిన వుంగరాన్ని ఆయనకు బహుకరించడమే కాకుండా వద్దంటున్నా వినకుండా నా శ్రీమతికి ఓ వెండి పూలసజ్జను వాళ్లావిడ చేత యిప్పించాడు. అలా చిట్టిబాబుతో యేర్పడ్డ అనుబంధం క్రమక్రమంగా పెరిగి మా యింటి పనులేమైనా వుంటే అతను పూరమాయించి చేయించి పెట్టే వరకు వచ్చింది. ప్రథమ వార్షికోత్సవం నాటికి చిట్టిబాబు వ్యాపారం మూడు వడ్డాణాలు, ఆరు అరవంకెలుగా సాగుతోందని తెలిసి ఆనందించాను. అయితే బిజినెస్ ఒత్తిడి వల్లనేమో యిది వరకటిలా అతను కనిపించడం లేదు. మా ఆవిడ ఫోన్ చేస్తే చాలు ‘మేడమ్ గారూ’ అంటూ వచ్చి వాలిపోయే అతని మనుషులు ఆవిణ్ని యిప్పుడంతగా పట్టించుకోవడంలేదు. ఆమె చిట్టిబాబు అవకాశవాదాన్ని తిట్టిపోస్తోంది. నాకు చిట్టిబాబు గురించిన దిగులు లేదు కాని యిటీవల ‘లు’ మౌనం నన్ను కలవరపెడుతోంది. ఎంత బిజీగా వున్నా నెలకు ఒకటి రెండు సార్లుయినా ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కొనే మనిషి నేను ఫోన్ చేసినా పలకడం లేదు. అతను ఏ విదేశీ పర్యటనలోనో వుండి నా కాల్స్ చూడలేదని మొదట్లో సరిపెట్టుకున్నా దేశంలో అతనికి సంబంధించిన వార్తలు నన్ను వెక్కిరిస్తున్నాయి. ‘లు’ ఆలోచనలతో ‘వర్రీ’ అవుతున్న నన్ను మా శ్రీమతి పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది. ‘మన శశకి ‘కైట్స్’లో ఇంటర్వ్యూ వున్నట్లు మీతో చెప్పాడా? ఈ రాత్రికి బయల్దేరుతున్నాడు’ ‘వెళ్లమను. డబ్బు కావలిస్తే నా పర్సులో ఉంది తీసుకోమను’ ‘డబ్బు గురించి కాదు. కైట్స్ చైర్మన్ ‘లు’ గారు మీ ఫ్రెండ్ కదా. ఆయనకు ఫోన్ చేసి అబ్బాయి ఇంటర్వ్యూ కొస్తున్నట్లు మీరో మాట చెప్పొచ్చు కదా!’ అంది నా శ్రీమతి నా నిర్లిప్తతకు విస్తుపోతూ. ‘ఆయన యిది వరకటిలా లేడు. నేను ఫోను చేసినా ఉలుకుపలుకూ లేదు. ఎంత యెత్తులో వుంటే మాత్రం అంత పట్టించుకోని వాణ్ని నన్ను ప్రాధేయపడమంటావా?’ ‘బావుంది. సొంత కొడుకు కోసం ఓ మెట్టు దిగితే అవమానమా?’ ‘అవమానమని కాదు, అంత అవసరం లేదు. మన వాడికి మెరిట్ వుంది. ఇక్కడ కాకపోతే యెక్కడైనా వాడికి ఉద్యోగ యొస్తుంది’ ‘ఎక్కడైనా వేరు. ఇది పేరున్న సంస్థ కదా. కనీసం ‘లు’ గార్కి ఓ లెటరైనా రాసివ్వండి’ అర్ధాంగి అభ్యర్థనను తోసి పుచ్చి యింట్లో అశాంతిని కోరి తెచ్చుకోవడం యిష్టం లేక మధ్యే మార్గంగా శశిని పిల్చి నా విజిటింగ్ కార్ట్ యిచ్చి ఇంటర్వ్యూకి ముందు ‘లు’ గార్ని కలవమన్నాను. శశికి తప్పకుండా ‘కైట్స్’లో ఉద్యోగ మొస్తుందనే నమ్మకంతో వున్న నేను వాడు తిరిగొచ్చి చెప్పిన సమాధానం విని దిగ్భ్రంతుణ్ణయాను. శశిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాడనుకున్న వేంకటేశ్వర్లు ‘అలాగా, చూస్తాను’ అంటూ నేనెవరో తెలియనివాడిలా ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడట! ఆ తర్వాత ఇంటర్వ్యూలో శశి పెర్ ఫార్మెన్స్ చూసి కమిటీ మెచ్చుకున్నా చివరకు నిరాశే మిగిలిందంట!. వారం తరువాత శశిని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ ‘హెచ్. ఆర్’ ఆశ్చర్యంగా మా యింటికొచ్చాడు. అతను మా వాడికి వాళ్ల అమ్మాయి నిచ్చే ప్రపోజల్తో నేరుగా మాతో మాట్లాడ్డానికి వచ్చాడట. వాళ్లమ్మాయి బయోడేటా, ఫొటో మాకు న చ్చాయి. అవి అబ్బాయి చూసిన తర్వాత, ఆమెరికాలో వున్న మా అమ్మాయి కూడా ఓ.కె. చేస్తే ఏ విషయమూ ఆయనకు తెలియజేస్తామని చెప్పాం. వెళ్తూ వెళ్తూ ఆ హెచ్. ఆర్ శ్రీపతి చెప్పిన విషయం విని నేను ‘షాక్’కు గురయ్యాను. ‘మీ సంబంధం కోసం మేమంతకాలమైనా వెయిట్ చేస్తాం. ‘కైట్స్’లో మీ వాణ్ని ఇంటర్వ్యూ చేసిన కమిటీకి చైర్మన్ను నేనే. మీ అబ్బాయి రియల్ టైమ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్.. సింప్లీ సూపర్బ్. అలాంటివాడు కంపెనికీ ‘ఎసెట్’ అవుతాడని మా కమిటీ అతన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి లిస్ట్లో ‘టాప్’న పెట్టాం. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ఆశ్చర్యకరంగా మా చైర్మన్ ‘లు’ గారు మీ వాణ్ని పక్కన పెట్టారు. ఆయన చెప్పిన కారణం మాకంత సమంజసంగా అనిపించలేదు. ఏదైనా వ్యక్తిగతమైన ‘ప్రెజుడీస్’ కావచ్చు అనుకున్నాం. పోన్లెండి. అతణ్ని యెవరైనా కళ్లకద్దుకొని యింతకంటే మంచి జాబ్ యిస్తారు..’’ నా మొహం వివర్ణం కావడం గమనించి శ్రీపతి సెలవు తీసుకొని కారెక్కాడు. శశి సెలక్ట్ కాకపోవడానికి కారణం ‘లు’ గారే అనే చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను...! ∙∙ శశి విషయంలో ‘లు’ ఉపకారం చెయ్యకపోతే పోయింది, అపకారం చేశారని తెలిసిన తర్వాత ఆయనకు నా పట్ల ద్వేషానికి కారణం తెలియక మథన పడుతున్న నాకు గీత ప్రశ్న ద్వారా ఒక క్లూ దొరికింది. – అది చిట్టిబాబు రాజేసిన నిప్పు అని! అయితే నా వల్ల యెంతో కొంత వుపకారం పొందిన చిట్టిబాబుకు నా మీద పగ యెందుకుంటుంది? ఇది మరో పజిల్! ‘చిట్టిబాబు మీ వారి దగ్గర తెచ్చే ప్రస్తావనలో నా గురించి ‘నెగెటివ్’గా మాట్లాడేవాడా?’ ‘సారీ, నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను’ అంటూ గీత నొచ్చుకుంది. ‘కాదు. నిజం చెప్పి నా మనసు తేలికపడేలా చేశారు. ఇన్నాళ్లూ ‘లు’ గార్కి నా మీద కలిగిన అపార్థానికి కారణాలు తెలియక మానసికంగా చిత్రహింసను అనుభవిస్తున్నాను. మేడమ్, చిట్టిబాబు నా మీద చెప్పడానికి నేరాలేమున్నాయి?’ ‘మా వారికో బలహీనత ఉంది. ఆయన యెంత కింది స్థాయి నుంచి వచ్చిందీ యెవరికీ తెలియకూడదని. అలాగే ఆయన పేరు గురించి కూడా. ఆయన పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలిసిన మీరే ఆ గుట్టు బహిరంగం చేస్తున్నారని చిట్టిబాబు మా వారికి నూరిపోశాడు’ అందామె యెవరైనా వింటున్నారేమోనని అటూయిటూ చూస్తూ. ‘అందువల్ల చిట్టిబాబు కొచ్చే ప్రయోజనం? అతనికీ నాకూ యెలాంటి శత్రుత్వమూ లేదే!’ ‘మాష్టారూ, మీరు రచయిత కూడా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కాని అపకారం చెయ్యడానికి శత్రుత్వమే అవసరం లేదు – ఈర్ష్య చాలు! ఈర్ష్య, మనిషి కవల పిల్లలు. పక్కవాళ్ల యెదుగుదలను చూడలేకపోవడమనేది అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, ఇరుగుపొరుగు మధ్య, సహోద్యోగుల మధ్య... ఇలా అన్ని చోట్లా వుంటుంది. అలాగే చిట్టిబాబుకి మా వారితో మీ స్నేహం చూసి కన్ను కుట్టింది. ఆ ‘శాడిజం’తో మీ మీద చాడీలు చెప్పాడు. దేవుడు అందాన్ని చూడమని మనిషికి కళ్లిస్తే మనిషి ఆ కళ్లను చూడలేక పోవడానికి వినయోగించడం దౌర్భగ్యం!!’ గీత వాక్ప్రవాహం గీతోపదేశంలా సాగుతోంది. ఇంతలో స్టేషన్ వచ్చినట్టుంది.. బండి ఆగింది. ప్రయాణీకులు కోలాహలంగా మా ‘బే’లో చొరబడ్డంతో మా సంభాషణ అక్కడితో ఆగిపోయింది! - డా. పైడిపాల చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
SP Balasubrahmanyam: జీవితాన్ని ప్రేమించిన బాలుడు
ఆబాలగోపాలం ‘బాలు’ అని ముద్దుగా పిల్చుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వజ్రోత్సవ (75 సంవత్సరాల) జయంతి నేడు. ఆ మహామనీషి మన మధ్యలేని ప్రథమ జయంతి. బాలు ఒక సంగీత విశ్వవిద్యాలయమనీ, ఆయన సంగీత సాహిత్యాలను సమంగా ప్రేమించారనీ సర్వులకూ తెలుసు. ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమనీ, ఎదిగినకొద్దీ ఒదిగే వినయం ఆయన ఆభరణమనీ ‘పాడుతా తీయగా’ వీక్ష కులకు తెలుసు. ఆయన భాషాభిమానం విస్తృత సంగీత సాహిత్య పరిజ్ఞానం ఆ కార్యక్రమం ద్వారా వెల్లడయ్యాయి. వెరసి ఆదర్శ ప్రాయమైన వ్యక్తిత్వం గల ప్రతిభామూర్తిగా ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం పండిత పామర భేదం లేకుండా అందరికీ అభిమాన పాత్రులయ్యారు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అన్నారు ఒక పాటలో డాక్టర్ సి.నారాయణరెడ్డి. అలా తన పుట్టుక పరమార్థం తెలిసిన కారణజన్ముడు బాలు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలోను, రెండు మూడు ఇంటర్వ్యూలలోను బాలు జీవితంపట్ల తన ప్రేమను, సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నాకు కావలసినవన్నీ ఉన్నాయి. లగ్జరీస్ పట్ల కోరికలు లేవు. ఉండటానికి మంచి ఇల్లుంది. మంచి సంసారం ఉంది. బయటకు వెళ్తే నిల్చుని గౌరవించే మనుషులున్నారు. దేవుడు నాకిచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నాను. నాకిలాంటి జీవితం చివరి వరకు సాగాలనీ, నూరేళ్లూ నేను బతకాలనీ కోరుకుంటున్నాను. నాకు జన్మరాహిత్యం వద్దు. మళ్లీ జన్మ కావాలి. నేను మరుజన్మలో కూడా బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టి ఇలాగే గాయకుడినవ్వాలి. ఈ జన్మలో నేను చనిపోతే నిద్రలో చనిపోవాలి కానీ హాస్పిటల్కి వెళ్లకూడదు’ అంటూ జీవితంతో తన అనుబంధాన్ని, ఆశలను పునరుక్తం చేసేవారు. ఇప్పట్లో తన జోలికి చావురాదని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ‘శీతవేళ రానీయకు శిశిరానికి చోటీ యకు’ అని కృష్ణశాస్త్రి చెప్పినట్టు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లా సంగా నిత్యవసంతుడిలా ఉండేవారు. దురదృష్టవశాత్తు 2020 సెప్టెంబర్లో మృత్యువు కరోనా రూపంలో వచ్చి, దొంగదెబ్బ తీసి బాలును మనకు భౌతికంగా దూరం చేసినా– ఆయన నమ్మ కాన్ని మాత్రం వమ్ము చేయలేకపోయింది. కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువైన ఆయన మధుర స్మృతులను ఏ మహమ్మారీ చెరపలేకపోతోంది. ‘నా మాతృభాష సంగీతం’ అనే నినాదంతో 16 భాషల్లో సుమారు 40 వేల పాటల్ని ఆలపించి సంగీత ప్రపంచంలో శిఖ రాగ్రాన్ని అధిష్టించిన త్రివిక్రముడు బాలుడు. ‘స్నేహం చేసే ముందు అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. స్నేహం చేశాక మిత్రునిలో లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దాలి తప్ప, స్నేహాన్ని తెంచుకోకూడదు. అది దాంపత్య బంధం లాంటిది. కష్టమైనా నిష్టురమైనా భరించక తప్పదు’ అంటూ స్నేహాన్ని నిర్వచించి, నిజ జీవితంలో ఆచరించి చూపిన కర్మయోగి బాలు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పేర రికార్డింగ్ థియేటర్ను నెలకొల్పి, హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించి, జేసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దలపట్ల గౌర వాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారి బాలు. సీనియర్ గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణం. సంగీత దర్శకుడు సత్యం, హీరో కృష్ణ, ఇళయరాజా వంటి ప్రముఖులతో వచ్చిన వివాదాలను బాలు పరిష్కరించుకున్న తీరు, అతని సంస్కారానికి మచ్చుతునకలు. కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనీయని వితరణశీలి బాలు. తండ్రి పేరుతో ఒక ట్రస్ట్ను స్థాపించి క్రీడా వైద్య రంగాలకు చెందిన వారితో సహా ఎందరో విద్యార్థులకు ఆయన గుప్తదానాలు చేశారు. చివరిలో పిత్రార్జితమైన ఇంటిని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి ఉదారంగా ధారపోశారు. తన చరమదశలో ‘ఎస్పీబీ ఫ్యాన్స్ చారి టబుల్ ఫౌండేషన్’ ద్వారా కరోనా బాధితులను ఆదుకొన్న బాలు సేవా నిరతిని చూసి కరోనాకు కడుపు మండిందేమో అజాత శత్రువయిన ఆయననే కాటేసింది. ఎస్పీ బాలు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించిన ఆదర్శపుత్రుడు. హరికథా భాగవతార్ అయిన తండ్రి సాంబ మూర్తి కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్టించడమే కాకుండా ఆయన జీవిత చరిత్రను గ్రంథస్తం చేయించి ప్రచురించారు. తన సోదరి ఎస్పీ శైలజ, తనయుడు చరణ్ సినీ రంగంలో గాయనీ గాయకులుగా వారికి తగిన స్థాయిలో ఎదగకపోవడానికి తన క్రీనీడయే కారణమని మథనపడేవారు. ‘పాడుతా తీయగా’, ‘పాటశాల’ ద్వారా ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకు లను ప్రోత్సహించి కొందరిని వెండితెరకు కూడా పరిచయం చేసిన పెద్ద మనసుగల ఆచార్యుడు బాలు. ఆయన మరణాన్ని జయించిన యశఃకాయుడు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’లో రాసినట్టు– ‘జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అమృతంపు సోనను దోసిళ్లతో తాగి వచ్చినవాడు దుఃఖాన్నీ, చావునూ వెళ్లిపొమ్మన్న అమరుడు’ డాక్టర్ పైడిపాల సినీ గేయ సాహిత్య విమర్శకులు మొబైల్ : 99891 06162 చదవండి: SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం -
పొట్ట చించాక
ఆరుద్ర రచయిత్రి కె.రామలక్ష్మిని అభ్యుదయ వివాహం చేసుకున్నారు. ఆమె మీద ‘కె.రా. త్రిశతి’ అని మూడు వందల కవితలతో ఒక పుస్తకాన్ని రాశారు కూడా. అలాంటి రామలక్ష్మి ఒకసారి ఉదరానికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకోవలసి వచ్చింది. ఆమెను థియేటర్లోకి తీసుకెళ్లిన చాలా సేపటివరకూ లోపలినుంచి వైద్యులెవరూ వచ్చి ఏ కబురూ చెప్పకపోవడంతో ఆరుద్రకూ, సహచరులకూ ఆందోళన ఎక్కువైంది. తోటివాళ్లందరూ కంగారు పడుతుంటే ఆరుద్ర మాత్రం తాపీగా నవ్వుతూ– ‘‘పొట్ట చించారు కదా, అక్షరం ముక్క కోసం వెతుకుతున్నారేమో’’ అన్నారట. అంత క్లిష్ట సమయంలో కూడా ఆరుద్ర నిబ్బరానికీ, చమత్కారానికీ అంతా ఆశ్చర్యపోయామని ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి, రామలక్ష్మి దగ్గర ‘తాళ్లపాక వారి పలుకుబడులు’ పరిశోధన గ్రంథానికి సహాయకుడు అయిన ఎమ్వీఎల్ చెప్పేవారు. -డాక్టర్ పైడిపాల -
పెద్ద వ్యాఖ్యానం
సినీనటుడు జగ్గయ్య అరుదైన సాహితీవేత్త అని కొందరికే తెలుసు. తండ్రి సీతారామయ్య దగ్గర బాల్యంలో సంస్కృతాంధ్రాలను అభ్యసించిన జగ్గయ్య 15వ యేటే పద్యాలు రాశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ టాగూరు వివిధ కవితా సంపుటాల్లోంచి 137 ఖండికలను యెంచుకొని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించారు. 1980లో అవి పుస్తకంగా వచ్చాయి. పురాణ ప్రబంధ కావ్యాలలోని విశేష ప్రయోగాల గురించి జగ్గయ్య షూటింగ్స్ లేని సమయాల్లో ఆ పరిజ్ఞానం గల విద్యావంతులతో చర్చించేవారు. అలా ఆయనకు దగ్గరైన వారిలో ‘ముత్యాలముగ్గు’ నిర్మాత, నూజివీడు కళాశాలలో ప్రధాన ఆంధ్రోపన్యాసకుడు అయిన ‘ఎమ్వీయల్’ ఒకరు. ఒకనాడు వాళ్లిద్దరి మధ్య ‘మను చరిత్ర’ ప్రథమాశ్వాసంలోని ప్రవరుని గుణగణాలకు సంబంధించిన ప్రసక్తి రాగా, ఎమ్వీయల్ ‘ఆపురి బాయకుండు’ పద్యంలో పెద్దన శైలిని ప్రశంసించారట. అప్పుడు జగ్గయ్య కలిగించుకుని పద్యాంతంలో ‘ప్రవరాఖ్యు డలేఖ్య తనూ విలాసుడై’ అనే ప్రయోగానికి తనదైన భాష్యం చెప్పారు. సంస్కృతంలో ‘తనూ’ శబ్దం స్త్రీ వాచకమనీ, అనేక పర్యాయ పదాలుండగా పెద్దన తనూ శబ్దం వాడ్డం ప్రవరుడు స్త్రీ అంతటి సౌకుమార్యం కలిగినవాడని సూచించడమేనని జగ్గయ్య ఆ పద ప్రయోగ రహస్యం గురించి వ్యాఖ్యానిస్తే ఆయన పాండిత్య పటిమకు ఎమ్వీయల్ అవాక్కయ్యారట! - డాక్టర్ పైడిపాల -
నాటకం నుండి సినిమానా? సినిమా నుండి నాటకమా?
(జూన్ 20 నాటి ‘తొలి తెలుగు సినీకవి’ చర్చకు కొనసాగింపు) 1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది. 2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు. ఈ పాటల ప్రతి ఇప్పటికీ ఉన్నది. 3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మా తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు నాన్నగారు నాతో అన్నారు. అయితే ఇది రికార్డు చేయలేకపోయిన పరిస్థితులలో ‘రుజువు’ చెయ్యలేకపోవచ్చు. కాని మా నాన్న చెప్పడం ద్వారా నేను విన్న విషయమది. దీని రుజువుల కోసం ప్రయత్నిస్తున్నాను. అంతవరకు ఇవే సంగతులు. పైడిపాలగారికి అభినందనలు. డా॥ఎం.పురుషోత్తమాచార్య 9396611905
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement