-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
బడికి రప్పించేలా రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం మూడేళ్లలో రూ.3,117 కోట్లను వెచ్చించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద రూ.48.92 కోట్లతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్ కిట్లు అందిస్తున్నారు. వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 32,569 మందికి రూ.19.54 కోట్లు, సెకండరీ స్కూలు విద్యార్థులు 7852 మందికి రూ.4.71 కోట్లు రవాణా చార్జీలుగా అందించనున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో బడిబయట ఉన్న పిల్లలకోసం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వలస వెళ్లిన వారి పిల్లలు, ఇతర ప్రాంతాలనుంచి ఉపాధి కోసం వచ్చిన వారి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు సీజనల్ హాస్టళ్లను విద్యాశాఖ నెలకొల్పింది. అనాథలు, ఆర్థిక పరిస్థితి సరిగాలేని పిల్లల కోసం సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ) ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. -
నాడు– నేడు.. బడి అందం చూడు
కడప ఎడ్యుకేషన్: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక సమస్యలతో సతమతమయ్యేవారు. విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేక చెట్లకింద, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు సరైన వసతులు లేక.. పాఠశాలకు ప్రహరీలు లేక దారుణంగా ఉండేది. ఇలాంటి దుస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమస్యలన్నింటికి స్వస్తి పలుకుతూ నాడు– నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో నేడు చిన్నారులు విరబూసిన నవ్వులతో అక్షరాలు నేర్పే పాఠశాల చెంతకు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుకు పునాది పడే ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపుతున్నారు. రెండవ విడత.. చకచక ప్రభుత్వం జిల్లాలో రెండో విడత నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు మొదలై పలుచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనుల పూర్తికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 1028 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 322.83 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను సత్వరం పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. రూ. 144.72 కోట్లతో నాడు– నేడు, అదనపు తరగతి గదులు జిల్లావ్యాప్తంగా 18 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తంగా 99 పాఠశాలల్లో కేవలం అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. 68 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలల్లో నాడు నేడుతోపాటు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ పనులకు రూ. 144.78 కోట్లు కేటాయించారు. కేవలం నాడు – నేడు పనులకు కేవలం నాడు – నేడుకు సంబంధించి జిల్లాలో 461 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలకు, 63 హైస్కూల్స్ దీంతోపాటు మరో 203 అంగన్వాడీ కేంద్రాలకు కలుపుకుని రూ. 178.05 కోట్లను కేటాయించారు. పనులను పారదర్శకంగా నిర్వహించాలి నాడు– నేడు రెండవ విడత కింద చేపట్టనున్న పనులను చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా చేపట్టాలి. ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత లోపించకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు అదనపు తరగతులను నిర్మిస్తున్నాం. ఈ పనులను ఆగస్టు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. – అంబవరం. ప్రభాకర్రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి 8 పది రకాల సౌకర్యాల కల్పన నాడు– నేడు మొదటి విడత పనులకు అదనంగా మరో పని చేర్చి రెండో విడతలో పది రకాల పనులను చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, తాగునీటి వసతి మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి శుద్ధి పరికరాలను అమర్చనున్నారు. అన్ని తరగతి గదులకు ట్యూబ్లైట్లు, సిలింగ్ఫ్యాన్లు, బాలబాలికలకు విడివిడిగా నిరంతరం నీటి సౌకర్యంతో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు, బ్లాక్బోర్డు స్థానంలో గ్రీన్బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, తరగతి గదులకు పెయింటింగ్, పాఠశాల ఆవరణంలో గ్రానైట్ పనులు, ఉపాధిహామీ పథకంలో ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. -
బడి.. బాగుంది
సాక్షి,అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో అనే దయనీయ పరిస్థితుల నుంచి బయటపడి సకల వసతులతో కళకళలాడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ ఫలితాలు ఇవన్నీ. ఇప్పటికే తొలివిడత స్కూళ్లలో నాడు–నేడు పనులు పూర్తయి సర్వాంగ సుందరంగా రూపుదిద్దు కోగా ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ స్కూళ్ల వరకే ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళిక తయారైనా తదుపరి ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఇతర విద్యాసంస్థలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. సమున్నత లక్ష్యంతో శ్రీకారం.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు పడుతున్న అగచాట్లను గుర్తించారు. కనీస సదుపాయాలు కరువై విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడాన్ని చూసి చలించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తెచ్చారు. 45 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని నిర్దేశించారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్తు సదుపాయం–లైట్లు, ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేశారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా తదుపరి కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా జోడించారు. రూ.16,450 కోట్లతో 61,661 విద్యాసంస్థల్లో నాడు–నేడు నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది ఆగస్టు 16న ముఖ్యమంత్రి జగన్ వీటిని విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేశారు. అనంతరం మలివిడత నాడు–నేడు పనులను చేపట్టాలని ఆదేశించారు. ఇతర విద్యా సంబంధితసంస్థల్లోనూ నాడు–నేడును అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాల(డైట్స్)లతో పాటు ప్రతిష్టాత్మక శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులో చేర్చారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. పేదలకు పెనుభారం తప్పింది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయి. భారీగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించాల్సిన అవస్థలు తల్లిదండ్రులకు తొలగిపోయాయి. ముఖ్యంగా పేద వర్గాలకు పెనుభారం తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పక్కా భవనాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించడంతో విద్యార్ధులు ఉత్సాహంగా బడికి వస్తున్నారు. –పారది జ్యోతి, పెదమేడపల్లి ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యురాలు, విజయనగరం జిల్లా నాడు అంతా అధ్వానం.. మా ఊరిలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకొని ఖాళీ స్థలం అపరిశుభ్రంగా ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చేర్చేవారు. ఇప్పుడు అవస్థలు లేవు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రవేశాలు పెరుగుతున్నాయి. –అల్లు రాము, చైర్మన్, తల్లిదండ్రుల కమిటీ, కొర్లాం ప్రాథమిక పాఠశాల, విజయనగరం జిల్లా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లట్లేదు నాడు–నేడు మొదటి విడతలో మా పాఠశాలను ఆధునీకరించాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు, గ్రామస్తులు సహకరించారు. పాఠశాల చుట్టూ చెట్లు నాటారు. పాఠశాలతో పాటు టీచర్ల ప్రతిష్ట పెరిగింది. చిర‡స్థాయిగా ఉండేలా అభివృద్ధి చేశాం. మొత్తం 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎగువపల్లిలో ఏ ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం లేదు. –పీవీ శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం, ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల, కదిరి -
విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు. దొరబిడ్డల్లా పేద పిల్లలు ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు. కార్పొరేట్ హంగులతో.. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అక్షర యజ్ఞం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్టాప్లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. – జీజేఏ స్టీవెన్, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా ముందుకు.. విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.శ్యామ్సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడు పనులు తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
అల్లూరికి అర్ధ శతాబ్దం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement