-
ఖరీఫ్ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్లో 5.18 కోట్ల మెట్రిక్ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో జూన్లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది. సాగు తగ్గిన ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
పంటలు ఫుల్.. ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో ఆల్టైమ్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: ఈసారి వానాకాలం (ఖరీఫ్) సీజన్లో.. తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 2020 ఖరీఫ్లో 1,35,63,492 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేశారు. అప్పటికది ఆల్టైమ్ రికార్డు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికి 1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీంతో 2020 నాటి రికార్డును తిరగరాసినట్టయ్యింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 1.03 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగు విస్తీర్ణం, ఆ తర్వాత నుంచి తగ్గుతూ, పెరుగుతూ ఈ ఏడాది గణనీయంగా పెరగడం విశేషం. సీజన్ ఇంకా ఉండటంతో ప్రస్తుత విస్తీర్ణం మరింత పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వరి కూడా రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఈ పంట ప్రతిపాదిత సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలే. కానీ ఏకంగా 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇంకా ఈ నెలాఖరు వరకు నాట్లు పడతాయని భావిస్తున్నారు. గతేడాది (2021) వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. లక్ష్యం 1.43 కోట్ల ఎకరాలు.. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బుధవారం నాటికే 1,35,75,687 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, చెరువులు నిండటం, మంచి వర్షాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమయ్యాయి. అత్యధికంగా వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గుచూపగా కంది, సోయాబీన్ ఇతర పంటలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 49.98 లక్షల ఎకరాల్లో పత్తి వాస్తవానికి ఈసారి పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు. పత్తికి గతేడాది మార్కెట్లో గణనీయంగా ధర పలకడంతో ఈసారి దానివైపు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పత్తి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కీలక సమయంలో కురిసిన భారీ వర్షాలు పత్తి సాగుపై ప్రభావం చూపించాయి. అప్పటికే వేసిన పత్తి పంట లక్షలాది ఎకరాల్లో మునిగి పాడై పోయింది. చాలా ప్రాంతాల్లో రెండోసారి వేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు 49.98 లక్షల ఎకరాలకే పత్తి పరిమితమయ్యింది. దీంతో ఊపందుకున్న వరి రికార్డు స్థాయిలో సాగయ్యింది. ఇక కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.61 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ లక్ష్యం 3.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.33 లక్షల ఎకరాల్లో వేశారు. 26 జిల్లాల్లో వంద శాతానికిపైగా సాగు రాష్ట్రంలో 26 జిల్లాల్లో వంద శాతానికి పైగా వానాకాలం సీజన్ పంటలు సాగయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో 139 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లాలో 84 శాతం సాగైంది. ఆదిలాబాద్ జిల్లాలో 107 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 119 శాతం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 112 శాతం, కరీంనగర్ జిల్లాలో 104, పెద్దపల్లి 105, జగిత్యాల 115, రాజన్న సిరిసిల్ల 119, సంగారెడ్డి 115, వరంగల్ 106, హనుమకొండ 103, జనగాం 126, భద్రాద్రి కొత్తగూడెం 113, వికారాబాద్ 116, మహబూబ్నగర్ 117, నారాయణపేట, యాదాద్రి జిల్లాల్లో 110, వనపర్తి 102, గద్వాల 100, నల్లగొండ 114, సూర్యాపేట 116 శాతం చొప్పున పంటలు సాగయ్యాయి. పుష్కలంగా నీరు, కరెంటు వానాకాలం పంటల సాగు తెలంగాణలో ఆల్టైం రికార్డు సాధించింది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. – పల్లా రాజేశ్వర్రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
ముందే మద్దతు ధర.. సీజన్ ప్రారంభంలోనే ప్రకటన
కడప అగ్రికల్చర్: ఏ పంట సాగు చేసుకుంటే లాభదా యకంతోపాటు గిట్టుబాటు అవుతుందనే విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు గాను ఖరీఫ్ సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కూడా సీజన్కు ముందుగానే పంటల వారీగా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జాబితాను రాష్ట్రాలకు అందజేస్తూ రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించింది. పంటల వారీగా రైతులు సాగుకు పెడుతున్న పెట్టుబడులు, వస్తున్న దిగుబడులు, మార్కెట్లో పలుకుతున్న ధరలు, అన్నదాతకు లభిస్తున్న నికరాదాయం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా మినియం సపోర్టు ప్రైసెస్(ఎంఎస్సీ) ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 17 పంటలకు మద్దతు ధరను ప్రకటించి రైతులకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 20 రకాల పంటలకు గాను 17 రకాలకు ప్రకటన ఖరీఫ్నకు సంబంధించి జిల్లాలో సాగయ్యే 20 రకాల పంటలకు గాను ఈ ఏడాది 17 రకాలకు మద్దతు ధర(ఎంఎస్పీ)ని ప్రకటించింది. జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, పసుపు, మిరపతోపాటు పలు రకాల పంటలకు మద్దతు ధరను ప్రకటించారు. ఇందులో వరిధాన్యంపై రూ.100, జొన్నలు 232, సజ్జలు 100, రాగులు 201, కందులు, వేరుశనగ 300, పత్తి 335, మినుములు 300, పెసలు 480, సోయాబీన్ 350, సన్ఫ్లవర్పై రూ.385 మేర ధరను పెంచారు. ఆర్బీకే ద్వారా.. పంట చేతికొచ్చిన సమయంలో బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలు ఉంటే.. వరి, వేరుశనగ, కంది, పసుపులతోపాటు పలు పంటలను ఆర్బీకే వేదికగా కోనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్ సహకారంతో మార్క్ఫెడ్, నాఫెడ్, ఏపీ సీడ్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గతేడాది వరి, పసుపు కొనుగోలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లో జిల్లాలో వరి, పసుపు కొనుగోలు చేశారు. రైతులకు డబ్బులను కూడా ఆన్లైన్ ద్వారా ఖాతాలకు జమ చేశారు. చాలా పంటలకు మద్దుతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా చాలా పంటలకు మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించుకుని సంబంధిత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోంది. గిట్టుబాధ ధర కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హిమశైల, ఏడీ, మార్కెటింగ్ శాఖ, వైఎస్సార్ జిల్లా -
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్: మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
-
ముందుగానే నీటి విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమయ్యే రోజే గోదావరి డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ సాగును రైతులు ముందుగా చేపడతారు. సకాలంలో పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. నవంబర్లో తుపాన్ల ప్రభావం ప్రారంభమయ్యేలోగా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. తద్వారా ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి కాగానే సకాలంలో రబీ పంటల సాగు చేపట్టవచ్చు. నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా సాగు చేసుకునే వెసులుబాటను రైతులకు కల్పించాలన్నది సీఎం జగన్ సంకల్పం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందుచూపుతో నీటి నిల్వ.. ఖరీఫ్ పంటకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో పులిచింతల, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నిల్వ చేసేలా జలవనరులశాఖను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మే 12న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, లభ్యతను సమీక్షించిన సీఎం జగన్ ఆయకట్టుకు ముందుగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో ఐఏబీ (నీటి పారుదల సలహా మండలి) సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ముందుగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని, సకాలంలో పంటల సాగు చేపట్టాలని రైతులను చైతన్యం చేసింది. వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండటంతో వరుసగా 2019, 2020, 2021లో ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నీటి లభ్యత బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదీ కోటి ఎకరాలకు నీళ్లందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్కు ► పోలవరంలో నిల్వ చేసిన నీటిని రివర్ స్లూయిజ్ల ద్వారా విడుదల చేసి గోదావరి డెల్టాకు బుధవారం నుంచే సరఫరా చేయనున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 33.14 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్కు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఈ నెల 10 నుంచే నీరు విడుదల కానుంది. ► పెన్నా బేసిన్లోని సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు జూన్ 10 నుంచే నీటిని సరఫరా చేస్తారు. ► గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటితో ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూలై 15 నుంచి నీటిని సరఫరా చేస్తారు. ► గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ► తుంగభద్ర డ్యామ్, సుంకేశుల బ్యారేజీపై ఆధారపడ్డ హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ ఆయకట్టుకు లభ్యత ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement