‘నవరత్నాల’తో చంద్రబాబుకు నిద్ర కరువు.. | Sakshi
Sakshi News home page

‘నవరత్నాల’తో చంద్రబాబుకు నిద్ర కరువు..

Published Thu, Jul 13 2017 2:58 PM

‘నవరత్నాల’తో చంద్రబాబుకు నిద్ర కరువు.. - Sakshi

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’తో  చంద్రబాబు నాయుడుకు నిద్ర కరువైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజల జీవనాడి. నవరత్న పథకాలను పక్కదోవ పట్టించడానికే అసెంబ్లీ, హైకోర్టు కొత్త డిజైన్లు విడుదల చేశారు. ఏ దేశం వెళితే ఆ దేశం డిజైన్లు చెప్పడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు డిజైన్లు అన్నీ గ్రాఫిక్స్‌. మూడేళ్లుగా గ్రాఫిక్స్‌ చూసి చూసి జనం విసిగిపోయారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన చిన్న చిన్న హామీలే దిక్కులేదు కానీ రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమో చెప్పాలి.

దొడ్డిదారిన ఆర్థికమంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ప్రజల కష్టాలు తెలుస్తాయి. ఆయన మంచి ఆర్థిక మంత్రి ఎందుకు కాలేకపోయారు. యనమలకు చంద్రబాబుకు చెంచాగిరి చేయడంతోనే సరిపోతోంది. ఆయన వయసులో పెద్దవారు కానీ...మాటల్లో పెద్దరికం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కారణం యనమలే. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను గులకరాళ్లతో పోల్చడం సరికాదు. మాకు సామాన్యుడే నవరత్నాలు. వారి కోసమే నవరత్నాల హామీలు.

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో మంచి జరుగుతుందని అందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే... హేళన చేయడానికి టీడీపీ నేతలకు మనసు ఎలా వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని నిర్మాణంపై రోజుకో డిజైన్‌ విడుదల చేస్తున్నారు. అదేంటని అడిగితే రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుపడుతుందని ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిపక్షం అడ్డుకుంటుందని చెప్పడం ప్రభుత్వం చేతకానితనం తప్ప మరొకటి కాదు. మాకు సామాన్యుడే నవరత్నం, అతడే కోహినూర్‌ వజ్రం’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Advertisement
Advertisement