'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్' | Sakshi
Sakshi News home page

'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'

Published Sat, May 30 2015 1:19 PM

'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్' - Sakshi

హైదరాబాద్: టీడీపీ జాతీయ పార్టీ అని చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడినని సొంతడబ్బా కొట్టుకుంటున్నారని తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.... చంద్రబాబుకి వెన్నుపోటుదారుడనే ముద్ర ఉంది తప్పా జాతీయ నేత అన్న గుర్తింపు లేదని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఓ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో బలంగా ఉన్న దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. 2019లోగా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతందని షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించి గోదావరిలో కలిపేస్తారని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. కేసీఆర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం పోయినట్లుందని ఆరోపించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి టీఆర్ఎస్ లో కలుపుకున్నారని విమర్శించారు. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో ఉండే పార్టీలు ఏవో తెలుస్తుందని షబ్బీర్ అలీ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement