సూర్యాపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగలగిరి గణేష్ భార్య(35)తో అదే గ్రామానికి చెందిన మండవ కృష్ణ(40) వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించిన తీరు మార్చుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన గణేష్ శుక్రవారం రాత్రి కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతని పై గొడ్డలితో దాడి చేశాడు.
ఈ దాడిలో కృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను పోలీసులకు తెలిపిన స్థానికులు గాయపడిన కృష్ణ భార్యను ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.