హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు, కిషన్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డిలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆగస్టు 15 న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకునే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల దేశంలో ఇప్పటికీ పేదరికం పోలేదని, తెలంగాణలో మజ్లిస్ హస్తాల్లో తెలంగాణ సర్కారు కూరుకుపోయిందని, దళితులపై దాడులు పెరిగాయని, కుటుంబ పాలనలో తెలంగాణను బందీ చేశారని ఆరోపించారు.
తెలంగాణ విమోచన దినానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరలేదని, మద్యం మాత్రం ఏరులై పారుతోందని అన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన లక్ష్యంగా మోడీ పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, దీన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, బీజేపీ నేతలు నవభారత సంకల్ప ప్రతిజ్ఞ చేశారు.