థానే: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చిన్నారుల్లో నెలకొన్న పోషకాహారలోపంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ గురువారం పాల్ఘర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐదు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను సదర్శించిన ఆయన.. పోషకాహారలోపంతో ఉన్న తల్లులు, పిల్లలకు అందిస్తున్న చికిత్స గురించి ఆరాతీశారు. అలాగే పోషకాహారలోపం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే విలేజ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్(వీసీడీసీ)ను ఏర్పాటుచేయాల్సిందిగా అధికారును ఆదేశించారు.
పాల్ఘర్ జిల్లాలో పోషకాహారలోపంతో చిన్నారులు మృతి చెందుతున్న విషయం పట్ల జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆరోగ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.