దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం జనగామలో మంగళవారం ఉదయం విషాద సంఘటన జరిగింది. ఆకుల పోచయ్య అనే రైతు తాను పండించిన వరికుప్పపైనే ప్రాణాలు విడిచాడు. గ్రామంలోని ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు కేంద్రంవ వద్ద మంగళవారం వేకువజామున వరికుప్పపై నిద్రించిన పోచయ్య నిద్రలోనే తుదిశ్యాస విడిచాడు. తాను అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం కుప్పపైనే రైతు మృతిచెందడంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. రైతు గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎమ్ఆర్ఓ జయంత్రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పోచయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాను పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు వారం రోజుల క్రితమే పోచయ్య ఎస్ఎఫ్సి కేంద్రం వద్దకు తెచ్చాడని, అయితే కొనుగోళ్లు జరగకపోవడంతో రోజూ రావడం తిరిగి గ్రామానికి వెళ్లడం చేసేవాడని స్థానికులు తెలిపారు. వర్షం, దొంగతనం భయంతో రాత్రి పూడ వరికుప్పపైనే నిద్రించేవాడని, ధాన్యం అమ్ముడుపోలేదన్న బెంగతో మనస్థాపం చెంది గుండెపోటుతో మృతిచెందిఉంటాడని భావిస్తున్నారు.