జైపూర్‌కు రెండో విజయం | Sakshi
Sakshi News home page

జైపూర్‌కు రెండో విజయం

Published Sun, Aug 2 2015 11:45 PM

జైపూర్‌కు రెండో విజయం

పట్నా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్‌లో రెండో విజయం దక్కింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ఆకట్టుకోని జైపూర్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో రెచ్చిపోయింది. ఫలితంగా పుణేరి పల్టన్స్‌పై 35-29 తేడాతో నెగ్గింది.

సోను నర్వాల్ 8, జస్వీర్ సింగ్, రాజేశ్ నర్వాల్ ఎనిమిదేసి రైడ్ పాయింట్లు సాధించారు. జైపూర్ రెండు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఇరు జట్లు సమానంగా చెరి 20 రైడ్ పాయింట్లు సాధించాయి. పుణే కెప్టెన్ ప్రవీణ్ నివాలే 9 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రారంభం నుంచే జైపూర్ జోరును ప్రదర్శించడంతో తొలి అర్ధ భాగంలో 19-13తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఇదే ఆధిపత్యాన్ని చూపెట్టి పుణెను ఓడించింది.
 
పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ మధ్య  హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ 20-20తో ‘డ్రా’గా ముగిసింది. సోమవారం మ్యాచ్‌లు లేవు. మంగళవారం హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement