స్కాట్లాండ్లో ముగిసిన రెఫరెండం | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్లో ముగిసిన రెఫరెండం

Published Thu, Sep 18 2014 8:48 PM

స్కాట్లాండ్లో ముగిసిన  రెఫరెండం

 ఎడిన్‌బరో:  ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండం(ప్రజాభిప్రాయ సేకరణ) ఈ రోజు ముగిసింది. ఫలితాలు రేపు (శుక్రవారం) ఉదయం ప్రకటించనున్నారు. యూకే నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఏర్పడే  విషయంలో స్కాట్లాండ్ ప్రజల వైఖరి రేపు తేలనుంది. ఓటింగ్‌లో స్కాట్లాండ్ పౌరులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలింగ్‌బూత్‌లు తెరవకముందే  ప్రజలు వాటిముందు బారులు తీరారు.

 గత కొన్ని వారాలుగా స్కాట్లాండ్‌లో స్వాతంత్య్ర  అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం  హోరెత్తించింది.  స్వాతంత్య్ర అనుకూల వర్గానికి అలెక్స్ సాల్మండ్ నేతృత్వం వహిస్తున్నారు. స్వతంత్ర దేశంగా మారేందుకు గల ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోరాదని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ బ్రిటన్ నుంచి విడిపోవద్దంటూ అభ్యర్థిస్తూనే, విడిపోతే వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేరంటూ హెచ్చరించారు. యూకే ఐక్యంగానే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని బుధవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తం చేశారు. ఇంతకాలం బ్రిటన్‌తో కలిసుండటానికి మద్దతిచ్చిన స్కాట్లాండ్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే చివరి నిమిషంలో స్వతంత్ర వాదనకు మొగ్గు చూపుతూ ట్వీట్ చేశారు. ముర్రే ట్వీట్‌కు విశేష స్పందన లభించింది.
 కలిసుండేందుకే మొగ్గు
 అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. ‘యుగవ్’ చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52 శాతం మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48 శాతం మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. దాంతో ఫలితాలు తెలిసేవరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement