కోర్టు తీర్పు ఇచ్చేలోగా ఆయన్ను మార్చండి: ఆర్కే | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పు ఇచ్చేలోగా ఆయన్ను మార్చండి: ఆర్కే

Published Mon, Oct 24 2016 3:51 PM

కోర్టు తీర్పు ఇచ్చేలోగా ఆయన్ను మార్చండి: ఆర్కే - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సత్యనారాయణకు లా డిగ్రీ లేదని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. కనీసం డిగ్రీ కూడా లేని వ్యక్తి అసెంబ్లీ సెక్రటరీగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఇంటర్ మాత్రమే చదివిన వ్యక్తి చట్టాలు చేసే సభకు ముఖ్య అధికారిగా ఉండటమంటే తాము తలదించుకోవడమేనని అన్నారు. గతంలో తాను ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా స్పందించలేదని చెప్పారు. ఈ విషయంపై గవర్నర్ నరసింహన్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్లకు లేఖలు రాశానని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చేలోగా అసెంబ్లీ సెక్రటరీని మార్చాలని ఆర్కే డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement