-
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డిఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో.. -
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
కాశ్మీర దేశాన్ని పూర్వం వసువు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మాధర్మాలు ఎరిగిన వసువు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు. అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. నిత్యం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ దేవతలను తృప్తిపరచేవాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడినే మనసులో నిలుపుకొని ధర్మబద్ధ జీవనాన్ని కొనసాగించేవాడు.కొన్నాళ్లకు వసు మహారాజుకు మోక్ష కాంక్ష ఎక్కువైంది. రాజ్యభారాన్ని విడిచి, తపస్సు ద్వారా మోక్షాన్ని సాధించాలనే కోరిక పెరగడంతో, ఒకనాడు తన సోదరుల్లో సర్వసమర్థుడైన వివస్వంతుడిని పిలిచి, అతడి కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించాడు. తర్వాత బంధుమిత్ర పరివారాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కాలినడకన సాగుతూ దారిలో ఉన్న తీర్థాలన్నీ దర్శించుకుంటూ పరంధాముడైన శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడిగా కొలువైన పుష్కర తీర్థానికి చేరుకున్నాడు. తన తపస్సుకు అనువైన క్షేత్రం పుష్కర తీర్థమేనని తలచి, అక్కడ తగిన చోటు వెదుక్కుని తపోదీక్షలో కూర్చున్నాడు. శరీరం శుష్కించిపోయేలా కఠోర తపస్సు సాగించాడు. పుండరీకాక్షుడే పరమదైవంగా భావిస్తూ ఒకనాడు ఆశువుగా స్తోత్రాన్ని పఠించసాగాడు.‘నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన/ నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే/ విశ్వమూర్తి మహాబాహుం వరదం సర్వతేజసమ్/ నమామి పుండరీకాక్షం విద్యా విద్యాత్మకం ప్రభుం/ ఆదిదేవం మహాదేవం వేద వేదాంగ పారగం/ గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం..’ అంటూ వసు మహారాజు పుండరీకాక్ష పారస్తుతిని పఠిస్తుండగా, ఒక్కసారిగా అతడి ముందు ఒక భయంకరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. తుమ్మమొద్దులాంటి నల్లని దేహంతో, చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్లతో ఉన్నాడు. అతడు ‘రాజా! ఏమి ఆజ్ఞ!’ అని అడిగాడు.ఈ పరిణామానికి వసు మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘ఓయీ కిరాతకా! ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాడు. ‘రాజా! పూర్వం నువ్వు దక్షిణపథాన ధర్మప్రభువుగా ఉన్నావు. ఒకనాడు మృగయావినోదం కోసం అడవికి వెళ్లావు. అక్కడ జంతువులను వేటాడుతూ నువ్వు సంధించిన బాణం పొరపాటున ఒక మునికి తగిలింది. ముని ఆర్తనాదం విని నువ్వు హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నావు. అప్పటికే అతడు మరణించాడు. అనుకోని ఆ సంఘటనకు నీలో ఆందోళన కలిగింది. బ్రహ్మహత్యకు పాల్పడినందుకు బాధతో లోలోపలే కుమిలిపోయావు. రాజ్యానికి చేరుకున్న తర్వాత ఈ వృత్తాంతాన్ని నీ ఆంతరంగికుడికి చెప్పావు. అయినా అపరాధ భావన నీ మనసును తొలిచేయసాగింది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుడిని మనసారా ధ్యానించి ద్వాదశినాడు ఉపవాసం ఉన్నావు. ఆ పుణ్యదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఒక బ్రాహ్మణుడికి గోదానం చేశావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నువ్వు ప్రాణాలు వదిలావు. ప్రాణాలు వదులుతున్న సమయంలో అప్పటి నీ భార్య ‘నారాయణి’ పేరును ఉచ్చరించావు. ఆ కారణంగా నీకు ఒక కల్పం వరకు విష్ణులోక నివాసయోగం లభించింది.రాజా! నేనొక బ్రహ్మరాక్షసుడిని. అత్యంత ఘోరమైన వాణ్ణి. నీ దేహంలోనే ఉన్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలని అనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బయటకు లాగి రోకళ్లతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాల నుంచి పూర్తిగా బయటపడ్డాను. నువ్వు స్వర్గంలోకి ప్రవేశించావు. నీలో నా తేజస్సును నింపి నేను కూడా నీతో పాటు స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడచిన కల్పంలో జరిగిన చరిత్ర.ఈ కల్పంలో నువ్వు కాశ్మీర రాజకుమారుడిగా జన్మించావు. ఆనాటి నుంచి నేను నీ రోమకూపాల్లోనే ఉండిపోయాను. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశావు. అవేవీ నన్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే, రాజా! ఇప్పుడు నువ్వు పుండరీకాక్ష పారస్తుతిని పఠించగానే నేను నీ రోమకూపాల నుంచి బయటపడి, ఇలా కిరాతుడిలా ఏకరూపాన్ని పొందాను. పరమాత్ముడి స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి విముక్తిని పొందాను. నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది’ అని చెప్పాడు. కిరాతుడి ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వసు మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జన్మాంతర వృత్తాంతాన్ని చెప్పిన కిరాతుడిని వరం కోరుకోమన్నాడు. పరమాత్మ జ్ఞానం తప్ప తనకు వరమేదీ అక్కర్లేదన్నాడు కిరాతుడు. ‘ఓ కిరాతుడా! నీ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకున్నాను. నీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇకపై నువ్వు నా అనుగ్రహంతో ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధి పొందుతావు. జ్ఞానమార్గంలో మోక్షం పొందుతావు. పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని తలచి, భక్తిశ్రద్ధలతో ఈ పుండరీకాక్ష పారస్తుతిని పారాయణం చేసిన వారికి, ఆలకించిన వారికి పుష్కరతీర్థంలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది’ అని పలికాడు వసు మహారాజు. వెంటనే అతడి ముందు ఒక దివ్యవిమానం వచ్చి నిలిచింది. దేవదూతలు అతడికి సాదరంగా స్వాగతం పలికారు. తమతో పాటు విమానంలోకి ఎక్కించుకుని, వసు మహారాజును స్వర్గానికి తీసుకుపోయారు. – సాంఖ్యాయన -
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..) -
'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..
సినిమాల్లోనూ చూస్తుంటాం హీరోనే మొత్తం ప్రత్యర్థులను గడగడలాడించి యోధుడులా గెలవడం. రియల్ లైఫ్లో అంత ఈజీ కాదు. కానీ అటాంటి రియల్ హీరోని చత్తీశ్గఢ్లో చూడొచ్చు. ఒకేఒక్కడు యోధుడిలా లంగ్స్ ఆప్ చత్తీస్గఢ్గా పేరుగాంచిన హస్డియో అడువులను సంరక్షించారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద అటవీ సంపద. ఆయన ఒక్కడే అక్కడ ఉన్న గిరిజనులు ప్రజలను చైత్యన్యవంతం చేసి అక్కడ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేశాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వెనుదిరిగేలా చేశాడు. అందుకుగాను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు కూడా. ఎవరా వ్యక్తి అంటే..?'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'గా పేరుగాంచిన హిస్టియో అడువులు భారతదేశంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంలో ఒకటి. దాదాపు 657 చదరుపు విస్తీర్ణంలో దట్టమైన జీవవైవిధ్యమైన హస్టియో అడువులు భారతదేశంలోని అత్యంత విస్తృతమైన అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 25 రకాల అంతరించిపోతున్న జాతులు, 92 పక్షి జాతులు, 167 అరుదైన ఔషధ వృక్ష జాతులకు నిలయం ఈ అడవులు. దాదాపు 15 వేల మంది గిరిజనులు జీవనోపాధి ఈ హస్టియో అరణ్య అడవులపైనే ఆధారపడి ఉంది.అంతేగాక ఈ ప్రాంతం భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు నిల్వల్లో ఒకటి. ఈ హస్టియో అడవులు కింద దాదాపు ఐదు బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా. దీంతో 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హస్టియో అడవులలో ఉన్న గొప్ప జీవవైవిధ్యాన్ని గుర్తించి మైనింగ్ కోసం నోగో జోన్గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రదేశంలో మైనింగ్ కార్యకలాపాలు సాగించేందుకు ముమ్మరంగా ప్రయత్నించాయి. అంతేగాదు సుమారు 21 ప్రతిపాదిత బొగ్గు గనులను వేలం వేసే యత్నం చేసింది. దీంతో అటవీ, గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లా(43) స్ధానిక గిరిజన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి..బొగ్గు వేలాన్ని వ్యతిరేకించేలా చేశాడు. అంతేగాదు బొగ్గు గనులను రక్షించేందుకు గ్రామ శాసనమండలి చేత 2020లో 9.45 లక్షల ఎకరాల్లో లెమ్రు ఏనుగుల రిజ్వరాయర్ సంబంధించిన ఏనుగులు కారిడార్ని నియమించేలా పోత్సహించాడు. చత్తీస్గఢ్ బచావో వంటి హ్యాష్ ట్యాగ్ నినాదాలతో డిజిటల్, సోషల్ మీడియాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయాడు అలోక్. మోటారు సైకిల్పై ర్యాలీ దగ్గర నుంచి, వివాహ పత్రికల్లో సైతం అదే నినాదంతో కూడిన హ్యాష్ ట్యాగ్లు ఒక్కసారిగా పంచదృష్టిని ఆకర్షించాయి. గ్రామస్తుల చేత చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగలించుకుని కాపాడుకునేలా చైతన్యం తీసుకొచ్చాడు. దీంతో జూలై 2022లో రాష్ట్ర శాసనసభ మొత్తం హస్టియో అరణ్య ప్రాంతంలోని మైనింగ్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అమోదించింది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 21 నాటి 21 బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసింది. ఇలా అలోక్ శుక్లా తన ప్రణాళికబద్ధమైన అలుపెరగని కృషితో 21 మైనింగ్ గనుల తవ్వకాలు జరపకుండా నాలుగున్నర ఎకరాల అడువులను విజయవంతంగా రక్షించాడు. అందుకుగానూ ప్రతిష్టాత్మక గోల్డ్మ్యాన్ పర్వావరణ బహిమని అందుకున్నాడు. దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు. ఈ బహుమతి, ఆఫ్రికా, ఆసియా, యూరప్, ద్వీపాలు, ఉత్తర అమెరికా, దక్షిణ మధ్య అమెరికా వంటి ప్రపంచంలోని దాదాపు ఆరు ఖండాంతర ప్రాంతాల్లోని పర్యావరణ నాయకుల చేసిన కృషిగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవిస్తారు. కాగా, ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను శాన్ఫ్రావిన్సిస్కో పౌర నాయకులు రిచర్డ్, రోడా గోల్డ్మన్లు ఏర్పాటు చేశారు. (చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
వామ్మో! ఇంతపెద్ద నీటితొట్టెనా!?
ప్రపంచంలోనే అతిపెద్ద నీటితొట్టెను నిర్మించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నీటితొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక కొండను తొలచడానికి సిద్ధపడింది. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఈ నీటితొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు (రూ.4,191 కోట్లు) ఖర్చు చేయనుంది. విశ్వం ఆవిర్భావంలో కీలకమైన సూక్షా్మతి సూక్ష్మకణాలైన న్యూట్రినోలను కనుగొనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ భారీ నీటితొట్టె నిర్మాణాన్ని చేపడుతోంది. ‘న్యూట్రినో’లను కనుగొనడానికి ఈ తొట్టె అడుగున 40 వేల ఆటమ్ డిటెక్టర్లను అమర్చనుంది. న్యూట్రినోలు పరమాణవుల కంటే సూక్షా్మతి సూక్ష్మంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి అంతరిక్షంలో సంచరిస్తుంటాయి. ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సులువుగా చేరుకుంటాయి.ఇవి జీవుల శరీరాల్లోనూ కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయి. న్యూట్రినోల స్వభావాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే, విశ్వం గురించి ఇప్పటి వరకు ఉన్న ఆలోచనా ధోరణిలో మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రయోగానికి ఇరవై ఒక్క దేశాలు అండదండలు అందిస్తున్నాయి. ఈ నీటితొట్టె ఎత్తు 80 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు. అంటే, దీనిలో ఏకంగా ఒక బోయింగ్–747 విమానం నిలువునా పట్టేస్తుందన్న మాట.అబుదాబిలోని ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆక్వేరియం ‘సీ వరల్డ్’తో పోల్చుకుంటే, జపాన్ నిర్మిస్తున్న ఈ నీటితొట్టె పరిమాణం నాలుగున్నర రెట్లు ఎక్కువ. న్యూట్రినోల పరిశీలన కోసం హిడా నగరానికి చేరువలో ఉన్న కొండను తొలిచి చేపడుతున్న ఈ నీటితొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు. న్యూట్రినోల పరిశీలన, ఇతర ప్రయోగాలను 2027 నుంచి ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.ఇవి చదవండి: నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు.. -
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే! -
నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..
జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ. ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్ తెచ్చి ఫామ్హౌస్లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.‘టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’ కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం. ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం. ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల. నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం. ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పీ చంద్రశేఖరం.నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత. వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది. నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని. వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు. పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్. ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్. ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం. చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు. ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! ఫోన్ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్మార్నింగ్ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్ వచ్చింది. వీసా కన్ ఫర్మ్ అయ్యింది తాతయ్యా!ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది. కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి. ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు -
పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే!
1995, ఏప్రిల్ 6.. ఉదయం ఆరు దాటింది. అమెరికా, ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్కి.. ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ‘టామీ బుర్ష్ డిప్యాటిక్’ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలసి కాన్పు కోసం వచ్చింది. ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ 6 అని చెప్పడంతో.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం. నెల తప్పినప్పటి నుంచీ తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఒకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ. అయితే ఆమె భర్త జేమ్స్ టాడ్ కారల్ మాత్రం చాలా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే.. టామీకి అది మూడో కాన్పు. అప్పటికీ రెండేళ్ల క్రితం.. రెండో కాన్పులో బిడ్డ.. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దాంతో.. ‘పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో? ఏమవుతుందో’ అనే భయం అతడ్ని వెంటాడసాగింది. ఆ భయం అతడినే కాదు.. టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది.జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ప్రసవ వేదన అనుభవించింది టామీ. అప్పటివరకూ తల్లీబిడ్డల హాట్ బీట్స్ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్లు. కాన్పు సమయంలో కూడా.. ‘ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది’ అనే చెప్పారు. సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు. పుట్టబోయే బిడ్డకు ‘లోగాన్ కారల్’ అని పేరుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కానీ పుట్టిన బిడ్డ లోగాన్లో ఎలాంటి చలనం లేదు. దాంతో డాక్టర్ ఓకాన్.. బాబు(లోగాన్ )కు సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గదికి తరలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు. మెదడులో ఎలాంటి కదలిక లేదు. దాంతో సాయంత్రం 5:15 గంటలకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు. పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం.. ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టాడ్, టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు. ఆసుపత్రి సిబ్బంది.. బాబు లోగాన్ ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు. అనంతరం బాబుతో కలిపి ఫొటోలు తీస్తుండగా.. టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది. ఉలిక్కిపడిన ఆమె.. వెంటనే వైద్యులతో చెప్పింది. కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు. మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి.. ఆ విషయాన్ని మరోసారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్లింది.ఆ నర్సు.. లోగాన్ (బాబు)ను పరిశీలించి.. నాడి చూసింది. బాబు హార్ట్ బీట్నూ గమనించింది. ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది. వెంటనే డాక్టర్ ఓకాన్ను పిలిచి విషయం చెప్పింది. ఆమె బాబుని చెక్ చేసి.. షాక్ అయ్యింది. బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది. అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్, ఎనిమిది మంది నర్సులు నమ్మి.. నిర్ధారించిన తర్వాత.. కొన్ని గంటల్లో బాబు తిరిగి బతకడం మిరాకిల్గా.. అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది.ఆ రోజు మొదలు లోగాన్ ‘మిరాకిల్ బేబీ’గా వార్తల్లోకి ఎక్కాడు. ‘అన్సాల్వ్డ్ మిస్టరీస్’, ‘ఇట్స్ ఎ మిరాకిల్’ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్లో.. లోగాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బాబు పుట్టుక నుంచీ మానసిక సమస్యలతో బాధపడుతూ.. వీల్ చైర్కే పరిమితం అయ్యాడు. అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్నే గడిపిన లోగాన్.. తన 24వ ఏట.. 2020లో తీవ్ర అనోరోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆ రోజు చనిపోయాడనుకున్న లోగాన్ తిరిగి ఎలా బతికాడు? అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
విపరీతమైన నడుము నొప్పా? సరైన ట్రీట్మెంట్ కోసం..
-
డెలివరీ టైమ్లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్లు అందరూ సపోర్టివ్గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ!
ధనాధన్ సిక్సర్లు.. ఫటాఫట్ ఫోర్లు.. ప్రపంచ క్రికెట్ అభిమానుల కోసం ట్వంటీ20 పండగ సిద్ధమైంది.. ఐపీఎల్ ముగిసి వారం రోజులే కాలేదు.. అప్పుడే మరో 20–20 సమరానికి అంతా రెడీ.. మీరు హైదరాబాద్ అభిమానులైనా, రాజస్థాన్ ఫ్యాన్స్ అయినా.. బెంగళూరును ఇష్టపడినా... కోల్కతాను ప్రేమించినా.. ఇప్పుడు మాత్రం అంతా భారత జట్టు వీరాభిమానులే..ఫ్రాంచైజీ క్రికెట్ ఎలాంటి వినోదాన్ని అందించినా ఆటలో అసలు కిక్కు మాత్రం మన దేశం, మన జట్టు అనడంలోనే ఉంది! కాబట్టే టి20 వరల్డ్కప్ అంటే అంత క్రేజ్! అందుకే పదహారేళ్ల వ్యవధిలో ఎనిమిది మెగా టోర్నీలు వంద శాతం ఆనందాన్ని పంచాయి. ఈసారీ ఆ సంబరంలో ఎలాంటి లోటు రానివ్వనన్నట్లుగా మరో వరల్డ్కప్ మన ముంగిటకు వచ్చేసింది. అందమైన కరీబియన్ సముద్ర తీరాన కలిప్సో సంగీతంతో సాగే టి20 మ్యాచ్లకు ఈసారి అగ్రరాజ్యం అమెరికా కూడా జత కట్టడం కొత్త ఆకర్షణ. ఇన్నేళ్లుగా క్రికెట్ అంటేనే మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఇప్పుడు ఆతిథ్య జట్టుగా తమ దేశంలో కామన్వెల్త్ దేశాల ఆటకు స్వాగతం పలుకుతోంది. బరిలోకి దిగనున్న జట్ల సంఖ్య తొలిసారి 20కి చేరడం ఈసారి మరో ప్రత్యేకత. సంప్రదాయాలు, ప్రారంభోత్సవాల తంతు ముగిస్తే ఇక జట్లు మైదానంలో తలపడటమే మిగిలింది. ఇకపై నెల రోజుల పాటు ట్రవిస్ హెడ్ మనవాడు కాదు, కమిన్స్పై అభిమానం అస్సలు కనిపించదు, క్లాసెన్ తొందరగా అవుట్ కావాలనే మనం కోరుకోవాలి.గతంలో రెండుసార్లు చాంపియన్గా నిలవడంతో పాటు ఇప్పుడు ఆతిథ్యం కూడా ఇస్తూ వెస్టిండీస్ మరో కప్పై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ వేటలో జట్టునంతా హిట్టర్లతో నింపేయగా.. మాజీ విజేత ఆస్ట్రేలియా తమ స్థాయిని మళ్లీ ప్రదర్శించేందుకు ‘సై’ అంటోంది.ఒకసారి చాంపియన్లుగా నిలిచి రెండో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్, శ్రీలంక తమ అస్త్రాలతో సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా ట్రోఫీ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా ఆ జట్ల రాత మారుతుందా అనేది చూడాలి. లెక్కల్లో భాగంగా ఉన్నా డజను టీమ్లు టైటిల్ గెలిచే అంచనాల్లో లేవు. అయితే తమ స్థాయికి మించిన ప్రదర్శనతో సంచలనానికి అవి ఎప్పుడూ రెడీనే.ఇక చివరగా.. మన రోహిత్ శర్మ బృందం ఏ స్థాయి ప్రదర్శనతో భారత అభిమానుల కోరిక తీరుస్తుందనేది ఆసక్తికరం. ఎప్పుడో 2007లో తొలి టి20 వరల్డ్ కప్ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మనకు నిరాశే ఎదురైంది. ఈసారి విండీస్ దీవుల్లో విజయీభవ అంటూ అందరం దీవించేద్దాం!జట్ల సంఖ్యను పెంచి...టి20 వరల్డ్కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 టోర్నీలు జరిగాయి. 2007 నుంచి 2022 మధ్య వీటిని నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది 9వ టోర్నీ. గత నాలుగు వరల్డ్ కప్లలో 16 జట్లు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి క్రికెట్కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే ఈసారి 20 జట్లకు అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందుగా అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం మరో రెండు టీమ్లను ఎంపిక చేశారు. రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి టి20 ప్రపంచకప్లో ఆడనుండగా... ఆతిథ్య హోదాలో అమెరికా కూడా మొదటిసారి ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగుతోంది.నవంబర్ 16, 2001... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ హక్కుల ప్రకటన వెలువరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కలసి సంయుక్తంగా ఈ అవకాశం కోసం బిడ్ వేశాయి. అమెరికాలో కొత్తగా క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశం... కరీబియన్ దీవుల్లో కొత్త తరంలో క్రికెట్పై తగ్గిపోతున్న ఆసక్తిని పెంచేందుకు ఈ రెండు దేశాల బోర్డులు కలసి ముందుకు వెళ్లాలని 2019లోనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త బిడ్కు సిద్ధమయ్యాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో క్రికెట్కు ఇప్పటి వరకు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దేశంలోని వివిధ జట్లలో కూడా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చినవారే సభ్యులుగా ఉంటున్నారు. అయితే వాణిజ్యపరంగా ఆ దేశంలో మంచి అవకాశాలు ఉండటం కూడా అమెరికాను ఐసీసీ ప్రోత్సహించేందుకు మరో కారణం. పైగా 2028లో లాస్ ఏంజెలిస్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో కూడా టి20 క్రికెట్ను చేర్చడంతో దానికి ఒక ట్రయిలర్గా ఈ వరల్డ్కప్ ఉండనుంది. మరోవైపు విండీస్ గడ్డపై క్రికెట్కు క్రేజ్ తగ్గుతుండటంతో స్టేడియాల నిర్వహణ సరిగా లేక ఆ జట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్కప్తో కాస్త కళ పెంచే అవకాశం ఉండటంతో విండీస్ ముందుకు వచ్చింది. ఏర్పాట్ల కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకునేలా ఐసీసీ ఈ రెండు బోర్డులకు అవకాశం కల్పిస్తూ హక్కులను కేటాయించింది.మొత్తం 9 వేదికలు..వరల్డ్కప్ మ్యాచ్ల ఎంపిక కోసం అమెరికా–వెస్టిండీస్లకు హక్కులు ఇచ్చినా మ్యాచ్లు జరిగే వేదికల విషయంలో ఐసీసీ చిక్కులు ఎదుర్కొంది. ముందుగా అమెరికాలో నాలుగు స్టేడియాలను ఎంపిక చేశారు. వీటిలో న్యూయార్క్ శివార్లలో ఉన్న బ్రాంక్స్ స్టేడియానికి సంబంధించి జనం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ సమయంపాటు పార్క్ స్థానికులకు అందుబాటులో లేకపోవడంతోపాటు పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని వాదించడంతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వేర్వేరు దేశాల సమాహారమైన వెస్టిండీస్ నుంచి కూడా ఏడు వేదికలను వరల్డ్కప్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గ్రెనడా, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఆర్థిక సమస్యల కారణంగా మ్యాచ్ల నిర్వహణ కోసం బిడ్ వేయకుండా వెనక్కి తగ్గాయి. మైదానం సిద్ధం చేసేందుకు తమ వద్ద తగినంత సమయం లేదని డొమినికా కూడా తప్పుకుంది. చివరకు వాటి స్థానంలో కొత్త వేదికలను చేర్చి మొత్తంగా ఆరింటిని ఖరారు చేశారు.ఏ జట్టులో ఎవరున్నారంటే...భారత్..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్, బుమ్రా.ఇంగ్లండ్..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డకెట్, మొయిన్ అలీ, విల్ జాక్స్, లివింగ్స్టోన్, స్యామ్ కరన్, బెయిర్స్టో, ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్ హార్ట్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.దక్షిణాఫ్రికా..మార్క్రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, మిల్లర్, మార్కో జాన్సెన్, డికాక్, క్లాసెన్, రికెల్టన్, స్టబ్స్, బార్ట్మన్, కొయెట్జీ, జాన్ ఫార్చూన్, కేశవ్ మహరాజ్, నోర్జే, రబడ, షమ్సీ.ఆస్ట్రేలియా..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, హెడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, అగర్, ఇంగ్లిస్, వేడ్, కమిన్స్, ఎలిస్, హాజల్వుడ్, స్టార్క్, జంపా.న్యూజీలండ్..విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్వెల్, మిచెల్, నీషమ్, రచిన్ రవీంద్ర, సాన్ట్నర్, డెవాన్ కాన్వే, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, ఇష్ సోధి, సౌతీ.పాకిస్తాన్..బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, సయీమ్ ఆయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్, ఇమాద్ వసీమ్, ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఆమిర్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఆజమ్ ఖాన్.శ్రీలంక..హసరంగ (కెప్టెన్), నిసాంక, అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, కామిందు మెండిస్, షనక, వెల్లలాగె, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చమీర, మధుషంక, పతిరణ, తీక్షణ, నువాన్ తుషారా.వెస్టిండీస్..రోవ్మన్ పావెల్ (కెప్టెన్), హెట్మైర్, బ్రాండన్ కింగ్, రూథర్ఫర్డ్, రోస్టన్ ఛేజ్, రసెల్, హోల్డర్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, రొమారియో ఫెఫర్డ్, అకీల్ హొసెన్, గుడకేశ్ మోతీ.బంగ్లాదేశ్..నజ్ముల్ హొస్సేన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తన్జిద్, తౌహిద్ హృదయ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, లిటన్ దాస్, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, తన్వీర్ అస్లాం, రిషాద్ హొస్సేన్, ముస్తఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్.నేదర్లండ్స్..స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఒడౌడ్, తేజ నిడమనూరు, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్, లెవిట్, బస్ డి లీడి, టిమ్ ప్రింగిల్, వెస్లీ బరెసి, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, డేనియల్ డోరమ్, మికెరెన్, వివియన్ కింగ్మా.ఐర్లండ్..పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రోస్ అడెర్, బల్బీర్నీ, టెక్టర్, డెలానీ, కాంఫర్, డాక్రెల్, నీల్ రాక్, టకర్, మార్క్ అడెర్, హ్యూమ్, జాషువా లిటిల్, మెకార్తీ, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్.కెనడా..సాద్ బిన్ జఫర్ (కెప్టెన్), నవ్నీత్ ధలీవాల్, ఆరన్ జాన్సన్, మొవ్వ శ్రేయస్, రవీందర్పాల్ సింగ్, కన్వర్పాల్, దిల్ప్రీత్ బాజ్వా, పర్గత్ సింగ్, రయాన్ పఠాన్, హర్ష్ ఠాకెర్, జెరెమి జోర్డాన్, డిలాన్ హెలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖి, నికోలస్ కీర్టన్.నమీబియా..గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డావిన్, జేన్ గ్రీన్, కోట్జీ, మలాన్ క్రుగెర్, లీచెర్, స్మిట్, ఫ్రయ్లింక్, లింజెన్, డేవిడ్ వీస్, బ్లిగ్నాట్, జేక్ బ్రాసెల్, లుంగామెని, షాల్ట్జ్, షికోంగో, ట్రంపెల్మన్.అఫ్గానిస్తాన్..రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నాంగ్యాల్ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, కరీమ్ జనత్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్హక్ ఫారూఖి, ఫరీద్ అహ్మద్ మాలిక్, నూర్ అహ్మద్.నేపాల్..రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్, కుశాల్ భుర్తెల్, సందీప్ జోరా, కరణ్, కుశాల్ మల్లా, ప్రాతిస్, అనిల్ సాహ్, సోంపాల్ కామి, అభినాష్ బొహరా, గుల్షన్ జా, లలిత్ రాజ్బన్షీ, కమాల్ ఐరీ, సాగర్ ఢకాల్.ఒమన్..అకీబ్ ఇలియాస్ (కెప్టెన్), ప్రతీక్ అథవాలె, ఖాలిద్, మెహ్రాన్ ఖాన్, నసీమ్, కశ్యప్ ప్రజాపతి, షోయబ్ ఖాన్, జీషాన్ మక్సూద్, అయాన్ ఖాన్, నదీమ్, బిలాల్ ఖాన్, ఫయాజ్, కలీముల్లా, షకీల్ అహ్మద్, రఫీయుల్లా.పపువా న్యూ గినీ..అసద్ వాలా (కెప్టెన్), సెసె బావు, కిప్లిన్, హిరి హిరి, లెగా సియాక, టోనీ ఉరా, చార్లెస్ అమిని, సెమో కమెయి, జాన్ కరికో, కబువా, అలె నావో, చాద్ సోఫెర్, నార్మన్ వనువా, జేక్ గార్డెనర్, హిలా వరె.స్కాట్లండ్..రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, మైకేల్ జోన్స్, జార్జి మున్సే, లీస్క్, మెక్ములెన్, గ్రెవెస్, జార్విస్, షరీఫ్, క్రిస్ సోల్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్, ఒలీ కార్టర్, బ్రాడ్లీ కరీ, చార్లీ టియర్.ఉగాండా..బ్రియాన్ మసాబా (కెప్టెన్), ఫ్రెడ్ అచెలమ్, దినేవ్ నక్రాని, అల్పేష్ రాంజానీ, కెన్నెత్ వైస్వా, బిలాల్ హసన్, కాస్మస్, రియాజత్ అలీషా, జుమా మయాగి, రోజర్ ముకాసా, ఫ్రాంక్ నుసుబుగా, రాబిన్సన్ ఒబుయా, రోనక్ పటేల్, హెన్రీ సెన్యోండో, సిమోన్ సెసాజి.అమెరికా..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, నితీశ్ కుమార్, షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, షాడ్లీ, హసన్ అలీఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్.వందల్లో ‘ఒక్కడు’... ప్లేయర్ ఆఫ్ ద సిరీస్...బరిలో డజను కంటే ఎక్కువ జట్లు.. 200 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు.. చివరకు ఒక జట్టే విజేత.. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే వారుంటారు.. కొన్నిసార్లు వీరి ప్రదర్శన ఆయా జట్లను అందలాన్ని ఎక్కిస్తుంది.. లేదంటే టైటిల్కు చేరువ చేస్తుంది.. తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో పురస్కారం వరిస్తుంది. ఇప్పటి వరకు 8 సార్లు టి20 ప్రపంచకప్ జరగ్గా.. మూడుసార్లు మాత్రమే విజేత జట్టు నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నవారున్నారు. వారి వివరాలు క్లుప్తంగా..2007షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఓవరాల్గా ఈ టోర్నీలో అఫ్రిది 91 పరుగులు సాధించడంతోపాటు 12 వికెట్లు పడగొట్టాడు.2010కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)ఏడాది తిరగకుండానే మూడో టి20 ప్రపంచకప్ జరిగింది. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లండ్ జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. ఇంగ్లండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తం ఆరు మ్యాచ్లు ఆడిన పీటర్సన్ 243 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.2009 తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)ఇంగ్లండ్లో జరిగిన రెండో ప్రపంచకప్లో శ్రీలంక బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ నిలకడగా రాణించాడు. టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్లు ఆడిన దిల్షాన్ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 317 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం గెల్చుకున్నాడు. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి శ్రీలంక రన్నరప్గా నిలిచింది.2012షేన్ వాట్సన్ (ఆస్టేలియా)శ్రీలంకలో జరిగిన నాలుగో టి20 ప్రపంచకప్లో వెస్టిండీస్ జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును వెస్టిండీస్ ఓడించింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో వాట్సన్ 249 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరేందుకు దోహదపడ్డాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.2014 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా రెండోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో భారత జట్టును ఓడించి శ్రీలంక జట్టు తొలిసారి చాంపియన్గా నిలిచింది. విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సంపాదించాడు. ఆరు మ్యాచ్లు ఆడిన కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 319 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచాడు.2016 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా మూడోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. ఆరో టి20 ప్రపంచకప్కు తొలిసారి భారత్ వేదికయింది. వెస్టిండీస్ జట్టు రెండోసారి చాంపియన్గా నిలిచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో ప్రపంచకప్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లీ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 273 పరుగులు సాధించాడు.2021డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)రెండేళ్లకోసారి జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఈసారి ఐదేళ్ల విరామం వచ్చింది. 2020లో భారత్ వేదికగా ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఒక ఏడాది వాయిదా పడింది. 2021లో ఒమన్–యూఏఈ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్లో న్యూజీలండ్ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టి20 విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏడు మ్యాచ్లు ఆడి మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 289 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు.2022స్యామ్ కరన్ (ఇంగ్లండ్)ఏడాది తిరిగేలోపు ఎనిమిదో టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ జట్టు రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్యామ్ కరన్ బంతితో మెరిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్యామ్ కరన్ ఆరు మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.టోర్నీ ఫార్మాట్..మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతిజట్టూ తమ గ్రూప్లో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్లపరంగా ప్రతిగ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) తర్వాత దశ సూపర్ ఎయిట్కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టీమ్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ప్రతిటీమ్ తన గ్రూప్లో ఉన్న మిగతా 3 జట్లతో తలపడుతుంది. టాప్–2 టీమ్స్ సెమీఫైనల్కు చేరతాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.గ్రూప్ల వివరాలు..గ్రూప్-ఎభారత్, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా.గ్రూప్-బిఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లండ్, ఒమన్, నమీబియా.గ్రూప్-సివెస్టిండీస్, న్యూజీలండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ.గ్రూప్-డిశ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నేదర్లండ్స్, నేపాల్.టి20 వరల్డ్కప్ షెడ్యూల్ బ్రిడ్జ్టౌన్ గ్రౌండ్ ఫైనల్ మ్యాచ్ వేదిక..– మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
Shraddha Kapoor: బహు భాషిణి
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా లిప్స్టిక్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది. శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు. -
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్గా అభివర్ణించారు. -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
మునోళ్లు ముక్కుతో కూడా రికార్డులు కొట్టేస్తారు; వరుసగా మూడోసారి
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసింది. వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai— Guinness World Records (@GWR) May 30, 2024ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం. -
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్లో జరగాల్సిన బోర్డు మీటింగ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్ప్రైజెస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. -
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : బాలీవుడ్ తారల సందడి, వీడియో వైరల్
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ స్పెషల్ క్యూయిజ్ పాప్-రాక్ స్టార్ కేటీ పెర్రీ అదర గొట్టేసింది. అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సారా అలీఖాన్ తన 'రోమన్ హాలిడే'ని ఆస్వాదిస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే త్వరలో తండ్రి కాబోతున్న రణ్వీర్ సింగ్ కూడా స్టేజ్పై స్టెప్పులతో అలరించాడు. క్రూయిజ్లో అతిథులతో సెల్ఫీకి పోజులిచ్చాడు. అలాగే ఓర్రీ అమాంతం ఎత్తివేసిన దృశ్యాలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.Radhika-Anant's 2nd pre wedding bash: Backstreet Boys perform 'I Wanna Be With You' at cruise party.#AmbaniWedding @backstreetboys Read more: https://t.co/fUFPEByuB0 pic.twitter.com/og7wMLZj6k— editorji (@editorji) May 30, 2024'లా వీటా ఇ అన్ వియాజియో' అనే థీమ్తో ఇచ్చిన లైవ్ ఈవెంట్ అతిథులను మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే కొలంబియన్ సింగర్ షకీరా అంబానీ ప్రీ వెడ్డింగ్లో ప్రత్యేకంగా పెర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం.'స్టార్రీ నైట్స్' క్రూయిజ్ వేడుకలో లెజెండరీ బాయ్ బ్యాండ్ బ్యాక్స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ప్రదర్శనతో ఈవెంట్ షురూ అయింది. వారి ట్రేడ్మార్క్ ఆల్-వైట్ దుస్తులను ధరించి, పాపులర్ ట్రాక్స్తో ఆహూతులను అలరించారు. ఇదే పార్టీలో అంబానీ, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్-శ్లోకా మెహతా ముద్దుల తనయ వేదా తొలి బర్త్డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. కాగా అనంత్-రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబైలోని BKCలోని జియో వరల్డ్ సెంటర్లో సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. -
జ్వరం ఒక వ్యాధి కాదు!
మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలని పోరపడుతూ ఉంటాం. నిజానికి జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజుల కు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా తాత్సారం చేస్తే జ్వర కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చురక్తశుద్ధికి...👉టేబుల్ స్పూన్ నెయ్యి లో పది మిరియాలు వేసి చిన్న మంట మీద వేయించి తర్వాత వడపోసి, మిరియాలు తీసివేయాలి. వీటిని ఆహారంలో మొదటి ముద్దలో కలిపి తినాలి, 40 రోజులపాటు ఇలా చేస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మవ్యాధులు అన్నీ హరించి వేస్తాయి పాస్టిక్ వాటర్ బాటిల్ లో, నీళ్లు తాగడం ఆపి కేవలం రాగి ΄ాత్రలో నీళ్లు మాత్రమే తాగండి ∙మీకు వచ్చే అన్ని రోగాలు, కొద్ది రోజులలో మటుమాయమవుతాయి. -
డ్రై ఫ్రూట్స్ ఎన్ని... ఎలా... తింటున్నారు?
డ్రై ఫ్రూట్స్! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు.ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని ΄పోందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?డ్రై ఫ్రూట్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుందాం.బాదం... బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువ గా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం, ΄పోటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ΄పోందవచ్చు.వాల్ నట్స్... వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.కర్జూరం... ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరి΄ోతతుంది.పిస్తా... పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ్రపోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.జీడిపప్పు... కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.ఎండుద్రాక్ష... ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, ΄పోటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కొలెస్ట్రాల్ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?
ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్డిఎల్ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్డిఎల్ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్డిఎల్ తగ్గడమే. హెచ్డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించడంతో΄ాటు హెచ్డీఎల్ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతులు కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్డీఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?చెడు కొవ్వు తగ్గడానికి...ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్ . డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి. -
Mitti Cafe: ఈ కేఫ్ చాలా ‘స్పెషల్’
‘మిట్టి’ అంటే మట్టి.ఈ మట్టి మీద పుట్టిన అందరికీ ఈ మట్టి మీద ఉన్న అన్ని ఉపాధుల్లో హక్కు ఉంది. కాని దివ్యాంగులకు చాలా చోట్లడోర్లు క్లోజ్ అయి ఉంటాయి.అందుకే 24 ఏళ్ల అలినా ఆలమ్ దివ్యాంగుల కోసమే నడిచే, వారే యజమానులుగా మారే కేప్లను‘మిట్టి కేఫ్’ పేరుతో స్థాపించింది.ఇప్పటికి 4000 మంది దివ్యాంగులు ఉపాధి ΄పోందారు.సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీనే ఈ ప్రయత్నాన్ని మెచ్చుకునిసుప్రింకోర్టుప్రాంగణంలో మిట్టి కేఫ్కు చోటు ఇచ్చారు.అలినా ఆలమ్ తన టీనేజ్లో కోల్కటాలోని నానమ్మ దగ్గర పెరిగింది. నానమ్మకు వెన్ను సమస్య వచ్చినప్పటి నుంచి ఆమెకు కదలడం, సొంత పనులు చేసుకోవడం చాలా కష్టమవడం గమనించింది. అది అలినా ఆలమ్ మనసులో ముద్ర పడింది. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చాక చదువులు, ర్యాంకులు అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నవారిని అందలం ఎక్కించేలా ఉన్నాయి కాని ఏ ఉ΄ాధి రంగమూ దివ్యాంగులకు మేము పని ఇస్తాం అనడం కనిపించలేదు. దివ్యాంగులు ఆత్మాభిమానంతో జీవించాలంటే వారికి సానుభూతి కంటే ఉపాధి కల్పించడమే చాలా ముఖ్యం అనుకుంది. ‘నేనే దివ్యాంగులకు పని ఇస్తాను’ అని నిశ్చయించుకుంది. ‘నీ దగ్గర ఏముందని వారికి పని ఇస్తావు?’ అని ఫ్రెండ్స్ అడిగారు. ‘సంకల్పం ఉంది’ అని చెప్పింది అలినా.2017లో మొదటి కేఫ్దివ్యాంగులకు పని ఇవ్వడమే కాదు... ఆ పని నలుగురి కంటా పడేలా చేయాలి... వారితో నలుగురూ మాట్లాడేలా ఉండాలి... ఈ ప్రయత్నాన్ని చూసి నలుగురూ తమ తమ రంగాల్లో అలాంటి వారికి పని ఇచ్చేలా ఉండాలి అనేది అలినా ఆలోచన. ఇందుకు ‘కేఫ్’ తెరవడం సరైనదనిపించింది. అప్పటికి చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అలినా ఇలాంటి ప్రయత్నానికి అండగా నిలిచే సేవాసంస్థ దేశ్పాండే ఫౌండేషన్ను కలిసి ఆలోచన చెప్పింది. నిధులు తీసుకుని ఉత్తర కర్నాటకలోని హుబ్లీలో తొలి ‘మిట్టి కేఫ్’ తెరిచింది. అందుకు ఊరిలో ప్రతి వీధి తిరిగి దివ్యాంగులకు ఉద్యోగం, ఉ΄ాధి అని చెప్పింది. కొందరు సందేహంగా చూశారు. కొందరు అపనమ్మకంతోనే వచ్చారు. నడక వీలుకాని వారు, బధిరులు, అంధులు, మరుగుజ్జులు, గూని బాధితులు... వీరు వచ్చి ఉత్సాహంగా పనిలో జాయిన్ అయ్యారు. మిట్టి కేఫ్లో టీ, కాఫీ, శాండ్ విచ్, సాదా సీదా భోజనం దొరికేలా మెనూ తయారు చేసింది అలినా. ఆ మెల్లగా అయినా సరిగ్గా చేయడం నేర్చుకున్నారు. వారికే మొత్తం నిర్వహణ, ఆదాయ పంపకం అప్పజెప్పి మరో మిట్టి కేఫ్ కోసం సాగి΄ోయింది అలినా.ఆహ్వానించే ప్రయత్నంఒక పని సఫలం కావాలంటే సరిగ్గా వివరించే ప్రయత్నం చెయ్యాలి... ఉద్దేశం పరిశుభ్రంగా ఉండాలి. అలినా ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి ఉన్నాయి. అందుకే కార్పొరెట్ సంస్థలు, ఎయిర్΄ోర్ట్ల యాజమాన్యాలు అందరూ ఆమెను ఆహ్వానించారు. బెంగళూరు ఎయిర్΄ోర్ట్, ముంబై ఎయిర్పోర్ట్లతో ΄ాటు పెద్ద పెద్ద ఆస్పత్రులలో కూడా మిట్టి కేఫ్లు ఏర్పాటయ్యాయి. ‘ఇప్పటికి దేశంలో 41 చోట్ల మిట్టి కేఫ్లు ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. సుప్రీంకోర్టు ప్రాగణంలో కూడా మాకు చోటు దక్కడం గొప్ప విషయం’ అంటుంది అలినా. ఈ కేఫ్ల ద్వారా ఇప్పటికి 4000 మంది దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వు వచ్చింది. ఆత్మాభిమానం తొణికిసలాడింది.వెతికి, శిక్షణ ఇచ్చి‘కేఫ్ పని అయినా శిక్షణ అవసరం. అందుకే నేను దేశంలోని కొన్ని ఎన్జిఓలను కాంటాక్ట్ చేసి ఆయా ్ర΄ాంతాల్లోని దివ్యాంగులను గుర్తించేలా చేశాను. అంతే కాదు ఇళ్ల నుంచి తరిమేస్తే రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న దివ్యాంగులను కూడా గుర్తించాను. ఒక పట్టణంలో ఒక సమూహం సిద్ధంగా ఉంది అని అర్థమయ్యాక వారికి అక్కడి వ్యక్తుల చేత రెండు నెలల ΄ాటు ట్రయినింగ్ ఇప్పించి మిట్టి కేఫ్లు స్థాపిస్తున్నాను. అందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఒకసారి కేఫ్ స్థాపించాక దాని మీద అధికారం ఆ దివ్యాంగులదే’ అంటుంది అలినా.‘మా మిట్టి కేఫ్ స్టాఫ్ మిగిలిన రెస్టరెంట్ల స్టాఫ్ అంత వేగంగా పని చేయక΄ోవచ్చు. చెప్పింది మెల్లగా అర్థం చేసుకోవచ్చు. కాని వారు పని గొప్పగా చేస్తారు. మీరు మెచ్చుకునేలా చేస్తారు’ అంటుంది అలినా. వీరు అమ్మే ‘కుల్హాద్ చాయ్’కి మంచి డిమాండ్ ఉంది. అన్నట్టు ఇక్కడ మెనూ బ్రెయిలీలో కూడా ఉంటుంది. ఇలాంటి కేఫ్ను ప్రతి ఊరికి ఆహ్వానించండి. -
వీరి వీరి గుమ్మడి విజయానికి చూపే దారి ఇది
వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది చెన్నైకి చెందిన పంప్కిన్ టేల్స్. ఆల్–ఉమెన్ టీమ్ రెస్టారెంట్గా ప్రత్యేకతను సాధించిన‘పంప్కిన్ టేల్స్’ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే బడి. చల్లగా చూసే అమ్మ ఒడి.‘పంప్కిన్ ఉపాధి ఇవ్వడమే కాదు. ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునేలా సహాయపడుతుంది’ అంటారు ఉద్యోగులు.ఉద్యోగం కోసం తాను ఉంటున్న డార్జిలింగ్ నుంచి గోవాకు వెళ్లాలనుకున్న అనూష మింజ్ విధివశాత్తు చెన్నైకి వచ్చింది. అక్కడి వాతావరణం ఆమెకు బాగా నచ్చింది.‘నా కొలీగ్స్తో ఎన్నో విషయాలు చర్చించే అవకాశం దొరికింది’ అంటుంది అనూష.‘మహిళలు కేఫ్లను నిర్వహించలేరు’లాంటి అపోహలకు అడ్డుకట్ట వేయడం కోసం చింది వరదరాజులు, జె.భువనేశ్వరి, ఆర్. రాజేశ్వరి అనే మహిళలు 2017లో ‘పంప్కిన్ టేల్స్’ప్రారంభించారు. రెస్టారెంట్, బేకరి, కేటరింగ్ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకుంది... పంప్కిన్ టేల్స్.టేబుల్స్ను సెట్ చేయడం నుంచి కస్టమర్లతో ఇంటరాక్ట్ కావడం, ఆర్డర్లు తీసుకోవడం, టేక్ అవేలను రెడీ చేయడం వరకు ఎన్నో పనులు చేస్తుంది ఈ ఆల్–ఉమెన్ టీమ్.‘ఉద్యోగంలో చేరే సమయంలో రెస్టారెంట్లో పనికి సంబంధించి వారిలోప్రాథమిక జ్ఞానం ఉంటుంది. ఆ తరువాత టేబుల్ సెట్ చేయడం నుంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వెంటనే వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది’ అంటారు కంపెనీ డైరెక్టర్లు భువనేశ్వరీ, రాజేశ్వరి.ఉదాహరణకు ‘పంప్కిన్’ వందమందికి పైగా మహిళల కుటుంబాలకు ఉ΄ాధి కల్పిస్తోంది. రెస్టారెంట్ ప్రారంభమైనప్పుడు షిల్లాంగ్కు చెందిన మోనిక వెయిటర్గా చేరింది. ఇప్పుడు ఆమె రెస్టారెంట్కు సంబంధించిన సమస్త విషయాలలోప్రావీణ్యం సాధించింది.‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయి చెన్నైలో పనిచేస్తోంది. నెల నెలా నాకు డబ్బులు పంపిస్తుంది అని నా గురించి అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది’ అంటుంది మోనిక.మోనిక ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట సొంతంగా రెస్టారెంట్ ్ర΄ారంభించవచ్చు. ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘పంప్కిన్ టేల్స్’ అనేది అనే ఉ΄ాధి కేంద్రమే కాదు, ఉజ్వల భవిష్యత్కు ఉపయోగపడే కేంద్రం కూడా. -
విడాకుల మహోత్సవం
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.అనిల్ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
మాస్ కా దాస్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
అమెరికా, చైనా మధ్య యుద్ధ మేఘాలు?
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-06-2024)
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల మార్పిడి
వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
Advertisement