పాతపట్నం : గంగువాడ పంచాయతీ మెట్టుపేట గ్రామానికి చెందిన బొమ్మాళి జగన్నాయకుడు (55) సోమవారం ఉదయం పురుగుల మందు తాగి మృతి చెందాడని ఎస్ఐ బి.సురేష్బాబు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తన పెద్దకొడుకు హరిబాబు పెళ్లికి చెప్పడానికి శనివారం ఉదయం పెళ్లి కార్డులు పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా హమిటి గ్రామంలో తన మేనల్లుడు ఇంటికి జగన్నాయకుడు వెళ్లాడు. మేనల్లుడి వద్ద రూ.10 వేలు అప్పు తీసుకుని ఆ రోజు బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. శనివారం రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కొడుకు హరిబాబు వేతకడానికి బయలుదేరాడు.
ఆదివారం ఉదయం తెంబూరు కండ్రవీధిలో ఉండడంతో ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటి దగ్గర భార్య పార్వతి, కుమార్తె రూపా కొడుకులు హరిబాబు, ధనంజయ రూ.10 వేలు అప్పు ఎందుకు తెచ్చావని ప్రశ్నించడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం గ్రామానికి అనుకుని ఉన్న కొండపైకి వెళ్లి పురుగుల మందు తాగి మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.