మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు

Published Tue, Sep 1 2015 10:13 PM

case file on former mla hariswar reddy

పరిగి(రంగారెడ్డి): టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పరిగి ఎస్‌ఐ నగేష్‌కుమార్ ధ్రువీకరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున హరీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి పరిగి స్థానానికి పోటీ చేశారు. అయితే గెలుపొందిన రామ్మోహన్‌రెడ్డి నిర్దేశిత వ్యయంకంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ హరీశ్వర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రామ్మోహన్‌రెడ్డి ఎక్కువ వ్యయం చేశారంటూ హరీశ్వర్‌రెడ్డి సమర్పించిన పత్రాల్లో ఉన్న సంతకం రామ్మోహన్‌రెడ్డి సంతకాలతో సరిపోలలేదని తేల్చారు.

ఆ నివేదికను కలెక్టర్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ నివేదికను ఆర్‌టీఐ ద్వారా పొందిన రామ్మోహన్‌రెడ్డి.. హరీశ్వర్‌రెడ్డిపై ఫిర్యాదుచేశారు. ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడ్డారంటూ సోమవారం పరిగి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన పరిగి కోర్టు న్యాయమూర్తి హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో హరీశ్వర్‌రెడ్డిపై ఎస్‌ఐ నగేష్‌కుమార్ ఫోర్జరీ, చీటింగ్ 417, 419, 420 తదితర ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా.. తాను ఎన్నికల్లో ఎక్కువ వ్యయం చేశానంటూ ఎలక్షన్ క మిషన్‌కు తప్పుడు పత్రాలు సమర్పించి ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడిన హరీశ్వర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి పరిగిలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement