చంద్రబాబు పర్యటన రోజున షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పర్యటన రోజున షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్

Published Tue, Apr 21 2015 5:30 PM

చంద్రబాబు పర్యటన రోజున షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్ - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ నెల 23న చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రెండు రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కిషన్‌రెడ్డి ఈరోజు ఇబ్రహీంపట్నంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్పై కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని  టీఆర్‌ఎస్ అధిష్టాన వర్గం భావిస్తోంది. చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పర్యటించే రోజునే కిషన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు క్షీణిస్తున్న టీడీపీ పరిస్థితి కిషన్ రెడ్డి కూడా పార్టీని వీడితే మరీ దయనీయంగా మారుతుంది.

Advertisement
Advertisement