ఆధ్యాత్మిక కేంద్రంలో రాసలీలలా...! | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక కేంద్రంలో రాసలీలలా...!

Published Fri, Aug 22 2014 11:09 AM

ఆధ్యాత్మిక కేంద్రంలో రాసలీలలా...! - Sakshi

కాకినాడ :  ఆధ్యాత్మికతకు ఆటపట్టయిన ఆ ప్రాంతాన్ని రాసలీలకు కేంద్రంగా మార్చేశారు. ఆలయంలో ఒక ఉద్యోగి ఈ రాసలీల బాగోతానికి కేంద్ర బిందువు అయ్యాడు. స్థానికుల ద్వారా ఈ విషయం జిల్లా కేంద్రానికి చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండల ముఖద్వారమైన మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ అతిథి గృహాన్ని ఒక ఉద్యోగి రాసలీలకు వేదికగా చేసుకున్నాడనే అంశం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల విడిది కోసం ఆలయంలో నాలుగు గదులతో కూడిన అతిథిగృహం ఒకటి ఉంది. వీటిలో ఒక ఏసీ గది కూడా ఉంది.

మూడు రోజుల క్రితం స్వామి రాత్రి 11 గంటల సమయంలో ఆ మండలానికి చెందిన ఒక యువతి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరొక యువతిని అతిథిగృహానికి తీసుకువచ్చింది.  ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి  ఏసీ గదిలో ఒక  యువతితో రాసలీలు  సాగించిన విషయం గుప్పుమంది. ఆలయ మాజీ ప్రతినిధి ఆ తరువాత రోజు ఉదయం ఆలయానికి వచ్చి  ఆరా తీసినట్టు సమాచారం.

ఈ విషయాన్ని చివరకు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకు వెళ్లారు. యువతుల భవిష్యత్తు దృష్ట్యా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా విడిచిపెట్టేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీనికి బాధ్యుడైన ఉద్యోగిని  మాత్రం బదిలీపై మరో ప్రాంతానికి పంపించేయాలని ఆ ప్రజాప్రతినిధి ఆదేశించారని తెలియవచ్చింది.  ఆలయ సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటంతోనే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడిందని భక్తులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement