ప్రభుత్వం గాఢ నిద్ర వదలాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం గాఢ నిద్ర వదలాలి

Published Fri, Nov 21 2014 3:26 AM

ప్రభుత్వం గాఢ నిద్ర వదలాలి - Sakshi

 నరసాపురం అర్బన్ : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలులో తెలుగుదేశం ప్రభుత్వం క్షమించరాని విధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గురువారం రుస్తుంబాదలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి మాట్లాడారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను నమ్మి ప్రజలు టీడీపీని గద్దెనెక్కించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ రైతు, డ్వాక్రా రుణాలమాఫీ అమలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.
 
 ప్రభుత్వం తీరు కారణంగా బీమా కంపెనీల నుంచి కూడా రైతులకు సాయం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఏరోజూ లేరన్నారు. అలాగే ఎంతో ఆశగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళలు నిరాశలో ఉన్నారన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నా ప్రధానమైన రుణమాఫీ అమలుకు కనీసం కనీస చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.
 
 ప్రభుత్వ ద్వంద్వ విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని అన్నారు. ఇసుక కొరత సమస్యను కేబినెట్ సమావేశంతో పరిష్కరించే అవకాశం ఉండగా, పక్కదేశాలతో చర్చలు, పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జపాన్, సింగపూర్, మలేషియా జపం మాని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పార్టీ నేతలు కొత్తపల్లి నాని, పప్పుల రామారావు, తిరుమాని బాబ్జి, గోగులమండ సుగుణరావు, ఏఎంసీ చైర్మన్ తిరుమాని రామకృష్ణరాజు, నల్ల కృష్ణంరాజు, రామాని కృష్ణ, మైల ధర్మరాజు, మల్లాడి గంటయ్య పాల్గొన్నారు.
 
 ప్రజాపోరాటాలకు సిద్ధం కండి
 నరసాపురం అర్బన్ : ప్రజా సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ప్రజలు పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్‌లో పోరాటాలు చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గరువారం రాత్రి స్థానిక ఎలక్ట్రికల్ గెస్ట్‌హౌస్ వద్ద నరసాపురం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కొత్తపల్లి మాట్లాడారు. రాజధాని నిర్మాణం కూడా సవ్యంగా జరుగుతుందనే ఆశ ప్రజల్లో లేదన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో పార్టీ నిర్మాణాత్మక, ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు.
 
 వచ్చే నెల 5న ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిపే ఆందోళనను జయప్రదం చేయాలని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. ఈనెల 24న స్థానిక తెలగా కల్యాణమండపంలో నరసాపురం నియోజకవర్గ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయీ సమావేశం ఏర్పాటు చేసినట్టు కొత్తపల్లి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు, అవలంబించాల్సిన ప్రణాళికలను సమావేశంలో చర్చిస్తామన్నారు.
 
 పార్టీ నాయకులు కొత్తపల్లి నాని, పాలంకి ప్రసాద్, షేక్ బులిమస్తాన్, పప్పుల రామారావు, చెన్నా రమేష్, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి జోసఫ్, దొంగ గోపీ, కావలి నాని, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బళ్ల వెంకటేశ్వరరావు, కామన బుజ్జి,  వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, సందక సురేష్, కత్తుల శ్యామ్, ముసూడి రత్నం, పతివాడ మార్కెండేయులు, బుడితి దిలీప్, సర్పంచ్‌లు జోషీ, కురుమా సుందరమ్మ, చామకూరి మోహన్‌రావు, అయ్యప్పనాయుడు, కవురు రాంబాబు, సంగాని లక్ష్మణరావు, ఎంపీటీసీలు బొక్క రాధాకృష్ణ, గ్రంధి వనజ, ఈదా జోన్సీ, పులగండం సత్యనారాయణ, మైల వసంతరావు, నేతల నాగేశ్వరరావు, ఇతర నాయకులు దొండపాటి స్వాములు, గుగ్గిలపు మురళి, అడ్డాల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ , వై.బాబులు, కావలి నాగరాజు, వంగలపూడి ఏషియా, మల్లాడి బుజ్జి, ఇంజేటి రవీంద్ర, అద్దంకి వెంకటేశ్వరరావు(ఏవీఆర్), బొడ్డు ఆశీష్‌కుమార్, బాషాఖాన్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement