భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్‌ రావడం ఇష్టముండదు: సజ్జల | Sakshi
Sakshi News home page

భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్‌ రావడం ఇష్టముండదు: సజ్జల

Published Sat, May 4 2024 8:02 PM

Land Titling Act: Sajjala Ramakrishna Reddy Fires On Tdp False Propaganda

సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.

అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి  మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు  భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో మార్పులు చేసి ఎంతో మంది భూములను  ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్‌డీఏ పరిధిలోని  భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి  అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.

‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.

‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్‌ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్‌ చట్టాన్ని  రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.

‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement
Advertisement