తాండూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య లోకల్.. నాన్లోకల్ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. తాండూరులో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం వేడి రాజేస్తోంది. నేను లోకల్ అంటే.. కాదు నేనే లోకల్ అంటూ ఎవరికి వారు స్థానికుడే ప్రచారం చేసుకుంటున్నారు. స్థానికేతరులు వద్ద.. స్థానికులే ముద్దు అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉండగా తానూ లోకలేనంటూ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్రెడ్డి అధికార పార్టీ నేతపై ఎదురు దాడికి దిగుతున్నారు. తాండూరులో ఇరు పార్టీ నేతల మధ్య రాజకీయ దీపావళీ పండుగకు ముందే అగ్గి పుట్టిస్తోంది. అయితే ఎన్నికల నామినేషన్లలో ఎవరి అడ్రస్ ఎక్కడ అనేది అధికారులు బహిర్గతం చేయడం గమనార్హం. ప్రచారంలో స్థానికత అంశం ప్రధాన అస్త్రంగా చేసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థిపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు తానూ లోకలేనంటూ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనోహర్రెడ్డి స్థానిక అడ్రస్తో నామినేషన్ దాఖలు చేశారు. అయితే తానే స్థానికుడిని పదేపదే చెప్పుకున్న రోహిత్రెడ్డి మాత్రం నామినేషన్ పత్రాల్లో రంగారెడ్డి జిల్లా అడ్రస్ పొందుపరచడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఎవరు లోకల్.. ఎవరు నాన్లోకల్ అనేది సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
మణికొండ వాసిగా పైలెట్
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అందులో స్థిర నివాసంగా రంగారెడ్డి జిల్లా మణికొండ మర్రిచెట్టు ప్రాంతంలోని లక్ష్మీనగర్ కాలనీ ప్లాట్ నంబర్ 66 పేరిట అడ్రస్ పొందుపరిచారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రోహిత్రెడ్డే నాన్లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాండూరు వాసిగా మనోహర్రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి తాండూరులోని శాంతినగర్ కాలనీ వాసిగా నామినేషన్ దాఖలు చేశారు. మనోహర్రెడ్డి నివాసం తాండూరు పట్టణంలోని శాంతినగర్ కాలనీ, 2–2–162/ఏ తన పేరిట ఉన్న ఇంటిని నామినేషన్ పత్రాల్లో పొందుపర్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
తాండూరు వాసిగాకాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి
రంగారెడ్డి జిల్లా వాసిగా బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డి
నామినేషన్ల దాఖలుతో చిరునామాలు బహిర్గతం
లోకల్.. నాన్లోకల్ పైనేప్రధాన పార్టీల అభ్యర్థులు విమర్శలు
స్థానికులనే ఆదరించాలంటున్న నేతలు