చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా

Published Fri, Mar 8 2024 8:25 AM

Yashasvi Jaiswal surpasses Virat Kohli for most runs in a Test series in 21 Century - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్‌ జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ జైశ్వాల్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్‌ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైశ్వాల్‌ చరిత్ర సృష్టించాడు. యశస్వీ ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి 692 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్‌తో కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డును ఈ ముంబైకర్‌(జైశ్వాల్‌) బ్రేక్‌ చేశాడు.

ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గవాస్కర్‌ 774 పరుగులు చేశాడు. అయితే ధర్మశాల టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌ మరో 63 పరుగులు చేస్తే.. సన్నీని కూడా జైశ్వాల్‌ అధిగమించే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ రికార్డుతో పలు అరుదైన ఘనతలను కూడా జైశ్వాల్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి(655) రికార్డును కూడా ఈ యువ ఓపెనర్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా జైశ్వాల్‌ నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌ పేరిట ఉండింది.  ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్‌ను అధిగమించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి.అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్‌ 30 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. క్రీజులో రోహిత్‌ శర్మ(52 నాటౌట్‌), గిల్‌(26) పరుగులతో ఉన్నారు.

Advertisement
Advertisement