ఒంగోలు అర్బన్: జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి కమాండ్ కంట్రోలు సెంటర్లో పోలింగ్ నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ పోలింగ్ నిర్వహించామన్నారు. మొదటి మూడు గంటల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బంది చక్కటి విధులు నిర్వహించారన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా యంత్రాంగం ఓటు హక్కుపై కల్పించిన అవగాహనతో ఓటర్లు భారీగా ఓటు వేశారని తెలిపారు.