రాత్రి 11.30నిశ్రీశ్రీ లకు అందిన సమాచారం మేరకు జిల్లాలో పోలింగ్ శాతం 82.63. మహిళలే నిర్ణేతలు
పల్లె నుంచి పట్నం దాకా ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా బూత్ల వద్ద జన జాతర నెలకొంది. వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేము సైతం అంటూ దివ్యాంగులు కూడా చైతన్యంతో పోలింగ్ కేంద్రాలవైపు కదిలారు. మండుటెండను సైతం లెక్కచేయలేదు. రాత్రి ఎనినిమిది గంటలు దాటినా పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కడపటి వివరాలు అందే సరికి జిల్లా వ్యాప్తంగా 82.63 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లలో సంక్షేమ గాలి వీచిందని వైఎస్సార్ సీపీ నేతలు ఉత్సాహంగా కనిపించారు.
ఒంగోలు సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు
మార్కాపురం జెడ్పీ గరల్స్ హైస్కూల్లో క్యూలో ఉన్న ఓటర్లు
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక మిగిలింది వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యమే. సోమవారం జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చైతన్యంతో పోటెత్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ ప్రక్రియలో ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు బూత్ల్లోకి ఓటర్లు ప్రవేశించకుండా పోలీసులు గేట్లు మూతేశారు. పోలింగ్ సమయంలో ముగిసేలోగా బూత్ల వద్ద క్యూలో ఉన్న వేలాది మంది రాత్రి పది గంటల వరకూ వేచి ఉండి ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చారు. తొలి గంట నుంచి చివరి నిమిషం వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి తరలించి సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం 7 నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. పోలింగ్ సాగుతున్న తీరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ కలెక్టరేట్లోని కంట్రోలు రూములో లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో భద్రతా చర్యలను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 74.21 శాతం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73.05 శాతం ఓటింగ్ నమోదు అయింది. 6 గంటలకు పోలింగ్ సమయం అయిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు.
పోలింగ్ ప్రక్రియ జాప్యం
జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ కొంత జాప్యం అయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం రావడంతో పోలింగ్ ఆలస్యంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు, షామియానాలు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల దూరంలో వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా 200 మీటర్ల అవతల రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిర్దేశించిన సైజులో షామియానా ఏర్పాటు చేసుకుని ఓటర్లకు అవసరమైన స్లిప్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్ల్ర వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు హల్చల్ చేశారు.
కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ
జిల్లా కేంద్రంలోని ప్రకాశం భవనంలో 16 మంది నోడల్ అధికారులతో వివిధ విభాగాలతో ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఓటు వేసేందుకు ఉత్సాహంగా కదం తొక్కిన మహిళలు, వృద్ధులు జిల్లాలో 2183 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలతో పోలింగ్ జాప్యం తెల్లవారుజామున ఆరు గంటల నుంచే క్యూకట్టిన ఓటర్లు ఆలస్యమైనా ఉత్సాహంగా ఓటు వేసిన ప్రజలు సాయంత్రం 6 గంటలకు 73.05 శాతం పోలింగ్ నమోదు 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందలాదిగా ఓటర్లు రాత్రి 10 గంటల వరకూ క్యూలోనే ఉండి ఓటేసిన వైనం ప్రకాశం భవన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ దినేష్కుమార్ పర్యవేక్షణ భద్రతా చర్యలపై ఎస్పీ గరుడ్సుమిత్ సునీల్ నిరంతర సమీక్ష