‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’ | Sakshi
Sakshi News home page

MP Sunil Kumar Pintu: సమోసాకు డబ్బుల్లేక చాయ్‌తో సరిపెట్టారు

Published Thu, Dec 21 2023 6:32 AM

MP Sunil Kumar Pintu: Just tea biscuits without samosa at INDIA meet - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్‌ నేత సునీల్‌ కుమార్‌ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్‌ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు.

‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్‌ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్‌ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు.
 

Video Credits:News18 Bihar


ఆయ్‌.. హిందీ తెలియాల్సిందే
విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్‌ కుమార్‌ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్‌ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్‌ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్‌ రాజ్యసభ సభ్యుడు మనోజ్‌ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్‌.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు.

Advertisement
Advertisement