Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు

Published Fri, Apr 12 2024 6:08 AM

Lok sabha elections 2024: Farmers want MSP, youth seeking jobs, but no one listening - Sakshi

రైతులు, నిరుద్యోగులనుద్దేశించి రాహుల్‌ వ్యాఖ్య

జైపూర్‌: తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు ఎంత మొత్తుకున్నా బాధలను మోదీ సర్కార్‌ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అనూప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ తమ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు. ఉపాధి కల్పించాలని నిరుద్యోగ యువత విన్నపాలు చేస్తోంది.

నిత్యా వసరాల ధరల నుంచి ఉపశ మనం కల్పించాలని మహి ళలు వేడుకుంటున్నా వీళ్ల గోడు ఎవరికీ పట్టదు’’ అని రాహుల్‌ అన్నారు. ‘‘  వెనుకబడిన వర్గా లు, దళితులు, గిరిజనులు, జనరల్‌ కేటగిరీలో ఉన్న పేదల అభ్యున్నతి కోసమే ఈ ఎన్నికలు. నిరుద్యోగమే దేశంలో అతిపెద్ద సమస్య. ద్రవ్యోల్బణం రెండో సమస్య.

దేశంలో 90 శాతం మంది ఇవే చెబుతారు. కానీ ఒకవేళ కేంద్రంలో బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న జాతీయమీడియాను ఫాలో అయితే మాత్రం మనకు అంబానీ కుమారుల పెళ్లివేడుకే దేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మోదీ ఓసారి సాగరగర్భంలోకి వెళ్తారు, మరోసారి గస్తీవిమానంలో చక్కర్లు కొడతారు, మరోసారి డప్పు వాయిస్తూ కనిపిస్తారు, ఇంకోసారి సభలో మొబైల్‌ ఫ్లాష్‌లైట్లు వెలిగించాలని పిలుపునిస్తూ కనిపిస్తారు. జాతీయ మీడియాలో 24 గంటలూ మోదీ ముఖమే దర్శనమిస్తుంది’’ అని ఎద్దేవాచేశారు. 

Advertisement
Advertisement