సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సన్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది.