నా అనుకున్న వాళ్లే హీరో విక్రమ్‌ను తొక్కేశారా.. ఆయనకు జరిగిన నష్టం ఏంటి? | Sakshi
Sakshi News home page

విక్రమ్- ప్రశాంత్ విభేదాలు ఈనాటివి కావు.. వారిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి?

Published Sun, Sep 24 2023 10:00 AM

Chiyaan Vikram And Actor Prashanth Behind Cold War - Sakshi

సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్​లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే విక్రమ్ సినిమా కెరీర్ ఆరంభం సవాళ్లతో కూడుకున్నది. విక్రమ్‌ను దురదృష్టవంతుడని కూడా అప్పట్లో కోలీవుడ్‌లో అనేవారు.

విక్రమ్‌ కెరీర్‌ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో విక్రమ్‌ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది. కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది. వంద రోజుల పాటు హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో కొనసాగింది. సేతు సినిమాతో తమిళనాట కొత్త ఉదయానికి సాక్షిగా విక్రమ్‌ నిలిచాడు. అక్కడి నుంచి విక్రమ్ వెనక్కి తిరిగి చూడలేదు.

మేనమామతో విక్రమ్‌కు కష్టాలు
విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నప్పుడు ఆయన  కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అతను నటించిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే. సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లోకి ఆయన సినిమాలు విడుదల అయ్యేవి. హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్‌కి సొంత మేనమామ అవుతాడు. ఆయనకు తమిళ చిత్రసీమలో ఒక నటుడు, డైరెక్టర్‌, నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. కానీ త్యాగరాజన్‌ తన మేనళ్లుడు అయిన విక్రమ్‌కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు. విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు.

విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో విక్రమ్ అన్ లక్కీ యాక్టర్ అనే ముద్ర పడింది. విక్రమ్‌తో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు. విక్రమ్ హీరోగా ఆయన 'సేతు' సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. చివరకు చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. సినిమా భారీ హిట్‌ అయినా నిర్మాతలు అంతగా లాభపడలేదు. దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు.

అతనికి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు. విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్ అప్పట్లో పెద్ద స్టార్. కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్‌ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు. సేతు సినిమాకు మరిన్నీ థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్‌ స్పందించలేదట. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు. అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్‌, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు.

విక్రమ్‌కు వచ్చిన సినిమా అవకాశాలను కూడా రానీయకుండా  త్యాగరాజన్  ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్ అవకాశాల కోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. చివరకు విక్రమ్ తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఈరోజు హీరో ప్రశాంత్ అంటే చాలామందికి తెలియని స్థితిలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ హీరో విక్రమ్‌ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు. 

ఒకప్పుడు రాబోయే తరానికి సూపర్ స్టార్ అని అనుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోనే లేరు. అప్పట్లో ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అజిత్, విజయ్, విక్రమ్ నేడు సూపర్ స్టార్లుగా ఎదిగారు. చియాన్ విక్రమ్ ఎప్పటికీ తమిళ సినిమా సూపర్ స్టార్. పొన్నియన్ సెల్వన్ విజయంతో జోరుమీద ఉన్న ఆయన.. త్వరలో తంగళన్, ధ్రువనక్షత్రం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Advertisement
Advertisement